ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ఐఆర్ లిస్టులో పేరు లేనివారికి, తప్పులు ఉన్నవారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. అందుకు సమాధానాలు ఇవ్వాలని ఓటర్లను కోరింది. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి సుమారు కోటి ఓట్లు పోతాయని తెలుస్తోంది. ఇటీవల ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇప్పటికే 70 లక్షలకుపైగా ఓట్లు గల్లంతు అవ్వగా.. మరో 25 లక్షల మంది నుంచి ఎస్ఐఆర్ ఫామ్స్ తిరిగి రాలేదని సమాచారం.
చాలా మంది ఓటర్లు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడంతో నోటీసులకు రిప్లయ్ అవ్వడానికి వారు రావడం లేదని తెలుస్తోంది. దీనికి తోడు కొందరు ఎస్ఐఆర్ ఫామ్స్ నింపడం, సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, 25 లక్షలకు పైగా ఎస్ఐాఆర్ ఫామ్స్ తిరిగిరాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును పొడగించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. బీఎల్వో అధికారుల మీద దాడులకు పాల్పడుతున్నట్టు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో ఓ మహిళా బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)పై దాడి జరిగింది. ఎంఐఎం పార్టీ నేత హసన్ మహిళా అధికారిణిపై దాడి చేసి చంపుతానని బెదిరించినట్టు తెలిసింది. దీంతో బాధితులురాలు ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
మూడు నెలల నుంచి తాను బీఎల్ఓగా విధులు నిర్వహిస్తున్నానని, తనను చాలా రోజుల నుండి వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత బీఎల్వో ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న తనను కొట్టాడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే తొటి ఉద్యోగి, అధికారి అడ్డుకున్నారని వెల్లడించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియాకు వివరించింది. కాగా, బాధితురాలికి బీజేపీ నాయకులు అండగా నిలిచినట్టు తెలిసింది. ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అధికారుల మీద దాడులు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.












