- కేసీఆర్ హయాంలో లక్షల ఎకరాలను కొల్లగొట్టారని పొంగులేటి అన్నారు
- ఆ భూములను రేవంత్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?
- భూభారతి తీసుకొచ్చాక కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి
- ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపై ఏం చర్యలు తీసుకున్నారు?
- అవసరం లేని భూములను 22ఏ లో చేర్చడంతోనే సమస్య మొదలైంది
- బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు
- పైరవీకారులు కుర్చీలో కూర్చొని పైరవీలు చేస్తున్నారు
- ల్యాండ్ లాక్ చేసింది అధికారులే కదా.. వాళ్లు ఎవరో చెప్పాలి
- అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై 22ఏ నిషేధిత జాబితా భూములకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ముప్పేట దాడికి దిగారు. ఆరోపణలకు జవాబివ్వకుండా చర్చను పక్కదోవ పట్టించేందుకు అసెంబ్లీలో శతవిధాలా యత్నించారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
నిషేధిత జాబితా మాటున ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాలకు, క్విడ్ ప్రోకో పద్దతిలో పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. అనేక మంది బడాబాబుల భూములు, నిర్మాణాలు నిషేధిత జాబితాలో లేవని ఆధారాలతో సహా నివేదించారు. నిర్మల్ జిల్లాలో సామాన్యులకు చెందిన 700 ఎకరాలను జాబితాలో పెట్టారని ధ్వజమెత్తారు. నిషేధిత భూముల అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఆనాటి దోపిడీ కంటిన్యూ
నాడు ధరణి, నేడు భూభారతి రెండు వ్యవస్థలు ఒక్కటేనని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో లక్షల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో చెప్పారని కానీ ఆ భూములను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యుల మీద ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. గతంలో రిజిస్ట్రేషన్లు తప్పుడుగా జరిగినట్లే, భూభారతి తీసుకొచ్చాక కూడా రిజిస్ట్రేషన్లు అలాగే జరిగాయని ప్రస్తావించారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
అవసరం లేని భూములను 22ఏ లో చేర్చడంతోనే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. ఐఏఎస్ అధికారులు అమాయ్ కుమార్, హరీశ్ లాంటి వారిపై చర్యలేవని ప్రశ్నించారు. నవీన్ మిట్టల్ లాంటి అధికారులపై చర్యలు తీసుకోకుండా ప్రజలకు ఏం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోందని నిలదీశారు. అసైన్డ్ భూములు లబ్ధిదారుడి దగ్గర లేదని, ప్రభుత్వం దగ్గర లేదని ప్రైవేట్ వ్యక్తులు భారీ టవర్లు కడుతున్నారని చెప్పారు. లొసుగులతోనే తప్పిదాలు చేస్తున్నారని రాత్రికి రాత్రి పేదలు కట్టుకున్న ఇళ్లు 22ఏ లో చేరిస్తే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఆ అధికారులపై చర్యలు ఏవి?
బాధితులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని పైరవీకారులు కుర్చీలో కూర్చొని పైరవీలు చేస్తున్నారని ఏలేటి ధ్వజమెత్తారు. ఎవరి మీద వ్యక్తిగత విద్వేషం తమకు లేదని చెప్పారు. సలహాలు తీసుకుంటే మీ ఇష్టం, తీసుకోకపోతే ప్రజలే సమాధానం ఇస్తారని అన్నారు. నాడు ధరణి.. నేడు భూభారతి ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని తెలిపారు. ల్యాండ్ లాక్ చేసింది అధికారులే కదా, ఆ అధికారులు ఎవరు?, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధరణి పోయాక భూభారతి వచ్చిన తర్వాత కూడా భూ బదలాయింపులు అక్రమంగా జరిగాయని ఆరోపించారు. ధరణిలో జరిగిన తప్పిదాల్లో బాధ్యులైన వారిపై చర్యలేవని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.











