భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ముసురుతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్లోని కీలక ప్రాంతాలైన కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్లలో తెల్లవారుజాము నుంచే వాన జోరుగా కురుస్తోంది.
అటు ఐటీ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్లతో పాటు.. లింగంపల్లి, చందానగర్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. ఉదయం నుంచే ఆకాశం పూర్తిగా మేఘావృతమై, చీకట్లు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడింది. ఈ హఠాత్తు వర్షంతో ఉదయాన్నే ఆఫీసులకు, పనులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఐటీ కారిడార్, కేపీహెచ్బీ పరిసరాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు, గణేష్ చవితి వేడుకల వేళ.. విగ్రహాలను మండపాలకు తరలించే నిర్వాహకులు, భక్తులు ఈ వర్షం కారణంగా తీవ్ర ఆటంకాలను ఎదుర్కొంటున్నారు. రోడ్లపైకి భారీగా నీరు చేరడం, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండటంతో.. వాహనదారులు, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు ఈ వర్షాల తీవ్రత కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ముఖ్యంగా మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమై, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సహాయక చర్యలు అందించాలని సూచించింది. కాగా వాతావరణంలో సంభవిస్తున్న ఈ ఆకస్మిక మార్పుల పట్ల ప్రజలంతా ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు..










