పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా భరించి.. జీవితాన్ని నచ్చినట్టు మలచుకోవచ్చని ఎందరో నిరూపించారు.. పేదరికాన్ని జయించి విజయతీరాలను ముద్దాడారు. కానీ నేడు కొంత మంది యువతకు అన్నీ సౌకర్యాలు అందుబాటులో ఉన్న కూడా సాకులు చెబుతూ, చదువును నిర్లక్ష్యం చేస్తూ, అడ్డదారులు తొక్కుతూ తమ జీవితాలను నాశం చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఇన్స్ ప్రెషన్ గా నీలు అనే నిరుపేద విద్యార్థిని నిలిచారు.
నీలు తల్లి ఆసుపత్రితో పాటు ఇళ్లలో పనిమనిషిగా జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే.. వైద్యవిద్యను అభ్యసించేందుక ఆమె కుమార్తె నీట్లో ఉత్తీర్ణత సాధించి మట్టిలో మాణిక్యంలా నిలిచింది. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లఖ్నవూకు చెందిన ఈ విద్యార్థిని తన చిన్నతనంలోనే వైద్యఖర్చులకు డబ్బుల్లేక తండ్రిని కోల్పోయింది. ఈ విషాద ఘటనకు కుంగిపోక పట్టుదలతో ఉపకార వేతనాల సాయంతో కష్టపడి చదివి ‘నీట్’లో ఉత్తీర్ణత సాధించింది.
మరోవైపు చదువు మాన్పించి, నీలుకు పెళ్లి చేయాలంటూ బంధువుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చినప్పటికీ, ఇళ్లలో పనిమనిషిగా చేసే ఆమె తల్లి ససేమిరా అంటూ కుమార్తెకు అన్నివిధాలుగా అండగా నిలిచి తన విజయానికి కారణం అయ్యింది. కాగా ఈ పేదయింటి కుసుమం కార్డియాలజిస్టుగా సేవలు అందించడమే తన లక్ష్యమని చెబుతోంది.
అదేవిధంగా యూపీలోని గోరఖ్పుర్కు చెందిన ఆటోడ్రైవరు కుమారుడు విశాల్ తివారీ(23) సైతం 605 మార్కులతో నీట్ ఉత్తీర్ణత సాధించారు. 2022లో పన్నెండో తరగతి పూర్తిచేసిన విశాల్ కుటుంబం ఆర్థిక పరిస్థితుల కారణంగా ట్యూషన్లు చెబుతూ పట్టుదలతో చదువుకొని నాలుగో ప్రయత్నంలో ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు.
పేదరికం వేసే సంకెళ్లను తెంచే ఏకైక ఆయుధం చదువు. కంటి నిండా కన్నీళ్లున్నా, కడుపు నిండా ఆకలి ఉన్నా... రేపటి వెలుగు కోసం పుస్తకాన్ని ఆయుధంగా మార్చుకుని, విధిని ఎదిరించి వికసిస్తున్న అద్భుత జీవితాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా, ఇలా వారు పేదరికాన్ని గెలిచి సరికొత్త చరిత్రను లిఖిస్తారు..












