కర్నూలు జిల్లాలోని కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్ పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో నిర్వహణ పనుల్లో భాగంగా గేట్లను ఎత్తుతుండగా ఈ ఘటన జరిగింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోని 9వ గేటును పైకి ఎత్తుతున్న సమయంలో అకస్మాత్తుగా దానికి సంబంధించిన రోప్ తెగిపోయింది. దీంతో భారీ ఇనుప గేటు ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయింది. రోప్ తెగిన వెంటనే గేటు కిందకు పడిపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు.
మరోవైపు ప్రస్తుతం శ్రీశైలం జలాశయం బ్యాక్వాటర్ భారీగా ప్రవహిస్తున్న సమయంలోనే గేటు దెబ్బతినడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదల, నియంత్రణకు సంబంధించి గేట్ల నిర్వహణ కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 9వ గేటు కిందపడిపోవడంతో నీటి విడుదల నియంత్రణకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక ఘటన తాలూకు సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు హుటాహుటిన హెడ్ రెగ్యులేటర్ స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. దెబ్బతిన్న గేటును పరిశీలించి, మరమ్మతులకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, గేటు పునరుద్ధరణతో పాటు నీటి ప్రవాహ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.









