భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానాశ్రయానికి అనువైన ప్రాంతాల ఎంపిక కోసం కేంద్ర బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమయ్యారు.
ఈ భేటీ అనంతరం కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై తాజా వివరాలను మంత్రి వెల్లడించారు. గతంలో విమానాశ్రయం కోసం గుర్తించిన రెండు ప్రాంతాలు అనుకూలంగా లేవని.. అందువల్ల తాజాగా మరో నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపిన తుమ్మల.. ఈ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఉన్న అవకాశాలను కేంద్ర సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుందని పేర్కొన్నారు..
ముఖ్యంగా విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలను బృందం పరిశీలించనుందన్నారు.. అలాగే కేంద్ర బృందం ఇచ్చే సాంకేతిక నివేదిక ఆధారంగా.. కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు తుమ్మల పేర్కొన్నారు. మరోవైపు మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపైనా కేంద్ర ప్రభుత్వంతో సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి విశిష్టతను, భద్రాద్రి ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యతను వివరిస్తూ.. ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఎందుకు అవసరమో కేంద్ర మంత్రికి వివరంగా తెలిపినట్టు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.. ఇక కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుపై కేంద్రం సాంకేతిక పరిశీలనకు సిద్ధం కావడంతో జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షకు మరో అడుగు ముందుకు పడినట్లైంది. ఈ క్రమంలో కేంద్ర బృందం నివేదికపై ఆసక్తి నెలకొంది..










