పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు, ఇల్లీగల్ మైగ్రేంట్స్ను దేశం నుంచి పంపించి వేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘సర్’ ప్రక్రియను చేపడుతున్నాయి. దీంతో డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు, అనర్హులకు ఓటు హక్కు కల్పించినట్టు అధికారులు గుర్తించారు.వాటిని ప్రస్తుతం ఏరివేసే బిజీలో అధికారులు నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలోనే దేశంలోకి అక్రమంగా రావడమే కాకుండా, తమ జాతీయతను దాచి అక్రమ మార్గాల్లో రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులను పొందిన ఒక పాకిస్థానీ మహిళ, ఆమె కుమారుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక తహసీల్దార్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సదరు తల్లీకుమారులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాగేపల్లి ప్రాంతానికి చెందిన మహ్మమద్ ఆయుబ్ ఖాన్ అనే వ్యక్తి గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయలో పాకిస్థాన్కు చెందిన ఫరా నాజ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వీరికి నలుగురు సంతానం. వారిలో మహ్మద్ ఫర్డీన్ అనే కుమారుడు పాకిస్థాన్లోనే జన్మించాడు. ఆ తర్వాత ఈ కుటుంబం మొత్తం భారతదేశానికి వచ్చి బాగేపల్లిలో నివాసం ఉంటోంది. పాక్ జాతీయురాలైన ఖాన్ భార్య ఫరా నాజ్, పాకిస్థాన్లో పుట్టిన ఆమె కుమారుడు ఫర్డీన్ ఇద్దరూ తమ జాతీయత వివరాలను దాచి ఇక్కడి ప్రభుత్వ గుర్తింపు కార్డులను పొందారు. సర్వే ప్రక్రియలో వీరి గుర్తింపు కార్డుల వ్యవహారం బయటపడింది.
దీంతో స్థానిక తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ రికార్డులు, వారి పత్రాలను తనిఖీ చేయగా వారు పాకిస్థాన్ జాతీయతను దాచి మోసపూరితంగా కార్డులు పొందినట్లు ఆధారాలతో సహా రుజువైంది. దీంతో వారికి ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు తొలగించినట్టు అధికారులు తెలిపారు.












