అంబర్పేట రౌడీషీటర్ శంకర్ వ్యవహారం నగరంలో మరోసారి సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో బెదిరింపులు, అక్రమాలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో అంబర్పేట పోలీసులు అతనిపై తిరిగి రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయితే గతంలో రౌడీషీట్ ఉన్న శంకర్పై.. 2019లో పోలీసులు దాన్ని క్లోజ్ చేశారు. అయితే కొంతకాలం తర్వాత మరోసారి అతడి వ్యవహారశైలి పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో.. అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో అంబర్పేట పోలీసులు శంకర్పై మరోసారి రౌడీషీట్ తెరిచారు. ఇక జూన్ నెలలో గాజులరామారం ప్రాంతంలో బిల్డర్కు తెలియకుండా ప్లాట్లు అమ్మడంతో అంబర్ పేట శంకర్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అంతేకాదు గతంలో ఓ న్యూస్ ఛానల్ నిర్వాహకులు, ఓ వ్యక్తి మధ్య వివాదాల విషయంలో జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు ఉండటంతో శంకర్పై కేసు నమోదైనట్టు కథనాలు వచ్చాయి.. తాజాగా అంబర్పేట పోలీసులు మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేయడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇక సాధారణంగా ఒక వ్యక్తిపై పదేపదే నేరారోపణలు, బెదిరింపులు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు సంబంధించిన కేసులు నమోదైతే.. పోలీసుల నిఘాలో ఉంచేందుకు రౌడీషీట్ తెరవడం జరుగుతుంది. ఇందులో భాగంగా సంబంధిత వ్యక్తి కదలికలు, కేసుల వివరాలను పోలీసులు పర్యవేక్షిస్తారు.
అయితే శంకర్పై నమోదైన కేసుల్లో ఆరోపణలు ఏ మేరకు వాస్తవమో దర్యాప్తులో తేలాల్సి ఉంది. గతంలో 2019లో రౌడీషీట్ క్లోజ్ కాగా.. ఇప్పుడు జూబ్లీహిల్స్, మేడిపల్లి పరిధిలో నమోదైన కేసుల నేపథ్యంలో మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేయడం.. అంబర్పేటలో మరోసారి హాట్టాపిక్గా మారింది. ఇక ఈ వ్యవహారంలో పోలీసుల తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది..









