Army Weapons Theft: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక వివరాలను వెల్లడించారు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్. విచారణ ఏ విధంగా జరిగింది, నిందితుడిని ఎలా గుర్తించారు, అతడు ఆయుధాలను ఏ విధంగా చోరీ చేశాడు, వెపన్స్ ను ఎక్కడ దాచాడు వంటి వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు.
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో ఆర్మీ ఆయుధాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేపట్టారు. ఆయుధాలను చోరీ చేసింది రిటైర్డ్ ఆర్మీ అధికారి అని ప్రాథమికంగా గుర్తించారు. నాగర్ కర్నూల్ లోని ఆర్మీ మాజీ అధికారి మల్లేశ్ ఇంటి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ మాజీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలు రాబట్టారు.
నిందితుడు గతంలో మద్రాస్ రెజిమెంట్ లో పని చేసినట్లుగా గుర్తించారు. ఆగస్టు 31న మద్రాస్ రెజిమెంట్ లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ లో ఆయుధాల చోరీ జరిగింది. 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, తూటాలు, బైనాకులర్ చోరీ అయ్యాయి. మద్రాస్ రెజిమెంట్ లోని బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్ ఛార్జ్, అమ్యునేషన్ సెక్షన్ ఇంచార్జ్ సహకారంతోనే ఈ చోరీ జరిగినట్లుగా పోలీసులు నిర్దారించారు.
''తొలుత బెల్ ఆఫ్ ఆర్మ్స్లోకి డెరెక్ట్ ఎంట్రీ కలిగున్న 16మందిపై దృష్టి పెట్టాము. ఆర్మ్స్ కోట్ ఇన్ఛార్జ్ వినోద్కుమార్తో పాటు అమ్యునేషన్స్ కోర్టు ఇంఛార్జ్ బల్లి మధులను అనుమానితులుగా విచారించాం. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత హవాల్దార్లుగా పనిచేసిన ప్రకాశం జిల్లాకు చెందిన టీపీఎస్ రావు, నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన మల్లేశ్ అలియాస్ రాజును విచారించాం. వారిద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై నిఘా పెట్టాము.
విచారణ సమయంలో మల్లేశ్ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. రెండు రోజులు విచారణకు రాలేదు. అతడి ఫోన్ లో కాల్ లాగ్, చాట్ పూర్తిగా డిలీట్ చేసి ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ తో నిలదీయడంతో నేరం ఒప్పుకున్నాడు. చోరీ చేసిన ఆయుధాలను నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని స్వగ్రామానికి తీసుకెళ్లి గుంతతీసి పాతిపెట్టాడు. వాటిని స్వాధీనం చేసుకున్నాం.
రాత్రి సమయంలో సీసీ కెమెరాలు లేని రూట్లను నిందితుడు మల్లేశ్ కు తెలుసుకున్నాడు. ఆగస్టు 28, 29 తేదీల్లో ఆయుధాగారం వద్ద పక్కా రెక్కీ నిర్వహించాడు. ఆగస్టు 30న కార్గిల్ గేట్ నుంచి ప్రవేశించి పరిస్థితులను గమనించాడు. 31వ తేదీన తాళాలు పగులగొట్టి ఆయుధాలను చోరీ చేశాడు. మొదట ఆయుధాలను ఒక చోట పాతి పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తరలించాడు. అచ్చంపేటలో ఆయుధాలను దాచాడు. 5 రోజుల తర్వాత మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ నెల 8న తిరిగి తన ఇంటికి తరలించాడు'' అని డీజీపీ వెల్లడించారు.
ఈ ఆయుధాల చోరీ కేసు వెనుక కారణంపై పోలీసులు లోతుగా దర్యాఫ్తు జరుపుతున్నారు. నిందితుడు మల్లేశ్ కు అంతర్జాతీయ ముఠాలతో గానీ, టెర్రరిస్టులతో గానీ ఏమైనా లింకులు ఉన్నాయా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.
కాగా.. బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వెపన్స్ ను ఎందుకు చోరీ చేశాడు? ఆ ఆయుధాలను ఏం చేయాలనుకున్నాడు? ఎవరికైనా అమ్మాలనుకున్నాడు? ఉగ్రవాద శక్తులతో ఏమైనా డీల్ చేసుకున్నాడా? ఆన్ లైన్ లో విదేశీ వ్యక్తులతో ఏం చాటింగ్ చేశాడు? ఇవన్నీ ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలు.










