TG SAFE: రాష్ట్రంలో కల్తీ, నకిలీ ఆహార పదార్థాల విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనలాగ్, నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్ (కృత్రిమ) పనీర్పై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
పనీర్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న నాన్-డెయిరీ, కృత్రిమ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని టీజీ సేఫ్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(a) నిబంధనల ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 10 నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి నకిలీ పనీర్ను తయారు చేసినా, హోటళ్లు, రెస్టారెంట్లలో సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మార్కెట్లు, వాణిజ్య సంస్థలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.








