Musi Project: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఒకటి. అత్యంత ప్రధానమైన ఈ ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. మూసీ ప్రాజెక్ట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్ పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మూసీ ప్రక్షాళన పేరుతో చేపడుతున్న పనులకు సంబంధించిన పర్యావరణ నిబంధనలు, అనుమతుల్లో లోపాలు ఉన్నాయని రిటైర్డ్ ఇంజినీర్లు ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే.. కేవలం 20 కిలోమీటర్ల మేర మాత్రమే అధ్యయనం చేశారని తమ అప్పీల్లో పొందుపరిచారు. ఇదే ప్రాంతంలో మృగవాణి జాతీయ పార్కు కూడా ఉందని తెలిపారు.
ఇక ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరిసరాల్లో భారీ నిర్మాణాలు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా రిటైర్డ్ ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అలాగే వాణిజ్య సముదాయాల ఏర్పాటుపైనా అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు వాదించారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై రిటైర్డ్ ఇంజినీర్లు దాఖలు చేసిన అప్పీల్ ను పరిశీలించిన ఎన్జీటీ.. ప్రతివాదిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది ఎన్జీటీ. ఆరోజు జరిగే విచారణలో పిటిషనర్లు లేవనెత్తిన పర్యావరణ అభ్యంతరాలు, పర్యావరణ అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వివరణలు అత్యంత కీలకం కాబోతున్నాయి.
మూసీ ప్రాజెక్ట్ లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా పర్యాటకులను ఆకర్షించి హైదరాబాద్ ఇమేజ్ ను పెంపొదించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ తరుణంలో ఇద్దరు రిటైర్డ్ ఇంజినీర్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ కి సంబంధించి అప్పీల్ దాఖలు చేశారు. మూసీపైన తలపెట్టిన నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతులను వారు సవాల్ చేశారు. తమ అప్పీల్ లో అనేక అంశాలను పేర్కొన్నారు.
మూసీ నది పరివాహక ప్రాంతం హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల వరకు ఉండగా.. కేవలం 20 కిలోమీటర్ల వరకే స్టడీ చేశారని, దానికి సంబంధించిన అభివృద్ది పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, మిగిలిన దానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి అనేదానిపై ప్రభుత్వం వివరాలు వెల్లడించలేదని రిటైర్డ్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీపంలో భారీ నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరాణానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. కాగా, దీనిపై దాఖలు చేసే కౌంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏయే అంశాలను పేర్కొంటుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే మూసీ ప్రక్షాళన అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అటు న్యాయపరమైన వివాదమూ నడిచింది.








