Chit Scam: హైదరాబాద్ కూకట్పల్లిలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. కిలాడీ దంపతులు అమాయకులను నిండా ముంచేశారు. సుమారు 20కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. కూకట్పల్లిలోని సాయిచరణ్ కాలనీకి చెందిన రమణా రెడ్డి, సీతమ్మ దంపతులు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. 15ఏళ్లుగా అక్కడే ఉంటూ స్థానికుల్లో మంచి నమ్మకం సంపాదించారు.
చిట్టీలు కట్టిన వారిలో ఎక్కువమంది రోజువారీ కూలీలు, మధ్య తరగతి కుటుంబాల వాళ్లే ఉన్నారు. కొందరు తమ పిల్లల చదువు కోసం, మరికొందరు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇంకొందరు సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం కష్టపడి సంపాదించుకున్న డబ్బును దంపతుల దగ్గర చిట్టీలుగా కట్టారు.
అయితే, రమణారెడ్డి దంపతులు వారిని మోసం చేశారు. చిట్టీ డబ్బులతో పరారయ్యారు. ఈ విషయం తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును కోల్పోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. బాధితులు రమణారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
జరిగిన మోసంపై సుమారు 50 మంది వరకు బాధితులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. కాగా, రమణారెడ్డి దంపతులు చిట్టీ డబ్బులు చెల్లించకపోగా తమకే కోర్టు నోటీసులు పంపారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నారు.
తాము కట్టిన డబ్బు చెల్లించకపోవడమే కాకుండా తమకు ఐపీ నోటీసులు ఇవ్వడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బుని చిట్టీల్లో పెట్టామని, ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రమణారెడ్డి దంపతులు అమెరికాకు పారిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఐపీ నోటీసులు ఇవ్వడం అంటే.. మేము డబ్బులు తిరిగి చెల్లించలేము, మా ఇంటికి వచ్చి ఒత్తిడి చేయొద్దు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని చెప్పడమే. ఇది అత్యంత దారుణం, అత్యంత దుర్మార్గం అని బాధితులు మండిపడుతున్నారు. పక్కా ప్లాన్తోనే రమణారెడ్డి దంపతులు మోసం చేసి డబ్బుతో పారిపోయారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన బాధితుల సంఖ్య మేరకు మోసం చేసిన విలువ రూ.20 కోట్ల వరకు ఉంది. కాగా, ఇంకా 70 నుంచి 80 మంది వరకు బాధితులు ఉన్నారని.. 50 కోట్ల రూపాయల వరకు మోసం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.









