సమాజానికి చీడలా మారిన మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. అమాయక యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేస్తూ కొందరు ముఠాలుగా ఏర్పడి విక్రయాలు సాగిస్తున్నారు. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారీగా గంజాయి లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది!
స్థానికంగా ఉన్న మార్కెట్ యార్డు ఆవరణలో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. మార్కెట్ యార్డును స్థావరంగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 5 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.
అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇటిక్యాల మండలం శెనిగపల్లి గ్రామానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మరోవైపు పట్టణ నడిబొడ్డున ఉన్న మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి దొరకడంతో.. గద్వాల పట్టణంలో గంజాయి సరఫరా, విక్రయాల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని ఈ మత్తు దందా నడుస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
ఇక ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు.. పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, రాత్రి వేళల్లో యువత గుమిగూడే స్థావరాలపై పోలీసులు నిఘాను మరింత తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఆరంభంలోనే అడ్డుకట్ట వేయకపోతే యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని కాబట్టి.. పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి.. గంజాయి రహిత గద్వాల కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు!..











