దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మహాభారతం సీరియల్లో భీముడి పాత్రలో నటించిన యాక్టర్, రెజ్లర్ సౌరవ్ గుజ్జర్ను హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లిపేరుతో మోసం చేశాడని, లైంగికంగా వాడుకుని వదిలేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సౌరవ్ గుజ్జర్ బాలీవుడ్ బుల్లితెరలో నటించడంతో పాటు సినిమాల్లోనూ పలు విలన్ పాత్రలు పోషించాడు. దీనికి తోడు అమెరికాలో నిర్వహించే రెజ్లింగ్ క్రీడల్లోనూ పార్టిసిపేట్ చేసి సత్తా చాటాడు.
వివరాల్లోకివెళితే.. 2021లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన గుజ్జర్.. అనంతరం వాట్సాప్ వేదికగా సన్నిహితంగా మెలిగాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. 2021 డిసెంబర్ 25న తొలిసారి కలిశామని, భార్యతో సమాన హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తనకు సన్నిహితంగా ఉంటూ దగ్గరయ్యాడని, తీరా పెళ్లి పేరు ఎత్తితే పట్టించుకోవడం లేదని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా సౌరవ్ గుజ్జర్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని వాపోయింది. అమెరికాలో ఉన్నప్పుడే కాకుండా భారత్కు వచ్చిన తర్వాత కూడా తామిద్దరం కలిసి జీవించామని యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని నమ్మించడంతో.. అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చానని బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది.
పెళ్లి గురించి అడిగినప్పుడల్లా మాట దాటవేస్తూ, ఫోన్ బ్లాక్ చేసి దూరమయ్యేవాడని బాధితురాలు ఆరోపించింది. 2025 అక్టోబర్ నుండి 2026 మార్చి దాకా తనతోనే ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా మాయం అయ్యాడని యువతి వెల్లడించింది.బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. ముంబై ఎయిర్పోర్టులో గుజ్జర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, యువతి ఆరోపించిన విధంగా నిజంగానే వీరిద్దరూ కలుసుకున్నారా? లేదా? అనే అంశం మీద కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. సౌరవ్ గుజ్జర్ మీద కేసు ఫైల్ కావడం బీటౌన్లో హాట్ టాపిక్ అయ్యింది.












