Erravalli Lands Inquiry: మాజీ సీఎం కేసీఆర్కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లోని భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజపూర్ గ్రామాల పరిధిలోని భూ రికార్డులపై రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయి విచారణను ముమ్మరం చేసింది. ఫాంహౌస్ను ఆనుకుని ఉన్న ఏకంగా 385 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయా అన్న కోణంలో అధికారులు జల్లెడ పడుతుండటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో సిద్దిపేట కలెక్టరేట్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కూక్ తహసీల్దార్ నేతృత్వంలో అధికారుల బృందాలు రంగంలోకి దిగాయి.
క్షేత్రస్థాయి పరిశీలన
వెంకటాపూర్, వరదరాజపూర్, ఎర్రవల్లి సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325తో పాటు పరిసర నంబర్లలోని అసైన్డ్ భూములను అధికారులు స్వయంగా పరిశీలించారు. అసలు రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి ఎంత ఉండాలి? ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణం ఎంత? అనే వివరాలను సరిపోల్చుతున్నారు.
మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలో పాత రికార్డులను తిరగేస్తున్న అధికారులు.. గత 20 నుంచి 30 ఏళ్ల క్రితం నాటి భౌగోళిక పరిస్థితులను తెలుసుకునేందుకు గూగుల్ ఎర్త్ మ్యాపింగ్ డేటాను వాడుతున్నారు. గతంలో అక్కడ ఉన్న చెరువులు, కుంటలు, గుట్టలు ఏమయ్యాయన్న కోణంలో డేటాను విశ్లేషిస్తున్నారు.
గతంలో ప్రభుత్వాలు పేద దళితులకు సాగు నిమిత్తం ఇచ్చిన అసైన్డ్ భూములు చేతులు మారాయా? ఇప్పుడు అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి? అన్న అంశంపై స్థానిక రైతులను ఆరా తీస్తున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన, డిజిటల్ రికార్డుల మ్యాపింగ్ పూర్తయిన తర్వాత.. ప్రస్తుతం ఆ భూములను తమ ఆధీనంలో ఉంచుకున్న రైతులతో పాటు ఇతరులకు సమన్లు, నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
శాటిలైట్ ఫోటోలు, దశాబ్దాల నాటి రికార్డుల ఆధారంగా అధికారులు రెడీ చేయనున్న ఈ నివేదికతో ఎర్రవల్లి ఫామ్హౌస్ పరిసరాల్లో జరిగిన భూ లావాదేవీల చిక్కుముళ్లు వీడే అవకాశం ఉంది. ఈ విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరితే రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందోనన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.









