తెలంగాణ

కేసీఆర్ మార్కు చెరిపేసే ప్రయత్నం వికటించిందా? కళ తప్పిన స్కిల్స్ యూనివర్సిటీ..!

రచన: Mamatha puppala7 నిమిషాల పఠనం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' (YISU) ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నడిచిన 'తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్' (TASK) సంస్థను పక్కనపెట్టి, భారీ బడ్జెట్ వెచ్చించి తీసుకొచ్చిన ఈ కొత్త విశ్వవిద్యాలయం రెండేళ్ల కాలంలో కేవలం 1,000 మందికి మాత్రమే నైపుణ్య శిక్షణ అందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' (YISU) ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నడిచిన 'తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్' (TASK) సంస్థను పక్కనపెట్టి, భారీ బడ్జెట్ వెచ్చించి తీసుకొచ్చిన ఈ కొత్త విశ్వవిద్యాలయం రెండేళ్ల కాలంలో కేవలం 1,000 మందికి మాత్రమే నైపుణ్య శిక్షణ అందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ ఈ విఫల ప్రయోగానికి తెరలేపిందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

 గతంలో 2015 నుంచి 2023 వరకు 'టాస్క్' ద్వారా ఏకంగా 8.37లక్షల మందికి పైగా యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించి ఐటీ, ప్రైవేటు రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలు కల్పించిన రికార్డు ఉంది. టాస్క్ మోడల్‌ను పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయి. అయితే, ప్రస్తుతం రూ.188కోట్లకు పైగా బడ్జెట్ వెచ్చించి నడుపుతున్న స్కిల్స్ యూనివర్సిటీ మాత్రం స్వతంత్రంగా నూతన కోర్సులు నిర్వహించలేకపోతోంది. మార్కెట్లో ఇదివరకే ఉన్న జీఎమ్‌ఆర్ ఏరో, అపోలో, టెక్ మహీంద్రా వంటి ప్రైవేటు సంస్థల కోర్సులకే తమ పేరు తగిలించి రీ-బ్రాండింగ్ చేసుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 సాంకేతిక నైపుణ్యం లేని ఉద్యోగాలకు శిక్షణ

ఈ విశ్వవిద్యాలయంలో నిధుల కేటాయింపులు భారీగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ పొందుతున్న వారి నాణ్యత మరియు ఉపాధి అవకాశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణ పొందిన వెయ్యి మంది విద్యార్థుల్లో దాదాపు 300 మంది స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్ కోర్సులకే పరిమితం కావడం విశేషం. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి చివరికి ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేని సాధారణ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడంపై విద్యావేత్తలు, నిరుద్యోగ యువత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 మరోవైపు, 'సాఫ్ట్ స్కిల్స్' కోర్సులో ఏడాది కాలంలో కేవలం ఇద్దరు విద్యార్థులే చేరడం దీని పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే లాజిస్టిక్స్, ఎండోస్కోపీ టెక్నీషియన్, జావా ఫుల్ స్టాక్ వంటి కోర్సుల్లో కూడా మొదటి బ్యాచ్‌తో పోలిస్తే రెండో బ్యాచ్ నాటికి అభ్యర్థుల సంఖ్య సగానికి తగ్గిపోవడం సంస్థపై యువతకు ఉన్న అపనమ్మకాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 శిక్షణకూ స్థానిక పక్షపాతం..

ఈ ప్రాజెక్టులో స్థానిక పక్షపాతం, భౌగోళిక వివక్ష కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో మరే ప్రాంతానికీ విస్తరించకుండా కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో 180మందికి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలో 60మందికి మాత్రమే శిక్షణ ఇవ్వడంపై మిగిలిన 117నియోజకవర్గాల నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ కేటాయింపులు కూడా నామమాత్రంగా, మొక్కుబడి శిక్షణగా ముగిశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 మొత్తానికి, గత ప్రభుత్వం చేపట్టిన దిగ్గజ ఉపాధి కార్యక్రమాన్ని కొనసాగించకుండా కేవలం రాజకీయోద్దేశాలతో తీసుకొచ్చిన 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' మోడల్ తొలి రెండేళ్లలోనే తీవ్ర నిరాశను మిగిల్చిందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నిధుల దుర్వినియోగం, ప్రైవేటు సంస్థలపై మితిమీరిన ఆధారపడటం, నాణ్యత లేని శిక్షణా విధానం వల్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వపు మరొక 'ఫ్లాప్ షో'గా మిగిలిపోయిందనే విమర్శలు పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

#YoungIndiaSkillsUniversity#RevanthReddy#TASK#TelanganaPolitics#BRSvsCongress#SkillDevelopment#TelanganaNews2026#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి