National

యూట్యూబ్ చూసి వండర్స్.. మన్ కీ బాత్‌లో కడప రైతుకు ప్రధాని ప్రశంసలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

సంప్రదాయ వ్యవసాయానికే పరిమితం కాకుండా నూతన సాంకేతికతను, వినూత్న పంటలను అందిపుచ్చుకుంటూ కడప జిల్లాకు చెందిన ఒక సాధారణ యువ రైతు దేశవ్యాప్త గుర్తింపు సాధించారు. ఏపీలోని కరవు సీమగా పేరొందిన పులివెందుల ప్రాంతానికి చెందిన 30ఏళ్ల కర్ప వరదరాజ్ సాధించిన అరుదైన విజయగాథను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కొనియాడారు.

 సంప్రదాయ వ్యవసాయానికే పరిమితం కాకుండా నూతన సాంకేతికతను, వినూత్న పంటలను అందిపుచ్చుకుంటూ కడప జిల్లాకు చెందిన ఒక సాధారణ యువ రైతు దేశవ్యాప్త గుర్తింపు సాధించారు. ఏపీలోని కరవు సీమగా పేరొందిన పులివెందుల ప్రాంతానికి చెందిన 30ఏళ్ల కర్ప వరదరాజ్ సాధించిన అరుదైన విజయగాథను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కొనియాడారు. ఇటీవల దేశవ్యాప్తంగా ప్రసారమైన 137వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ, వరదరాజ్ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలపడంతో ఆ యువ రైతు విజయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌గా మారింది.

 కడప జిల్లా పులివెందులకు చెందిన వరదరాజ్ కుటుంబం 2022వరకు సంప్రదాయ పద్ధతిలోనే టమాటా, అరటి పంటలను సాగు చేసేది. అయితే ఆ ఏడాది విపరీతంగా పెరిగిన పెట్టుబడులు, పంట నష్టాలు, మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాల నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ పంటల కోసం గూగుల్, యూట్యూబ్‌లలో అన్వేషణ ప్రారంభించిన వరదరాజ్, పోషకాలు మెండుగా ఉండే 'అవకాడో' (వెన్న పండు) సాగుపై దృష్టి సారించారు. మరింత స్పష్టమైన పరిజ్ఞానం కోసం స్వయంగా కర్ణాటకలోని అవకాడో తోటలను సందర్శించి అధ్యయనం చేశారు.

 కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత ఎదురైనప్పటికీ ధైర్యంతో నాలుగేళ్ల క్రితం తన పొలంలో అవకాడో మొక్కలను నాటారు. ఆయన పడ్డ శ్రమకు ఫలితంగా ఈ ఏడాది మార్చి నెల నుంచి దిగుబడి ప్రారంభమైంది. ఇప్పటివరకు దాదాపు నాలుగు టన్నుల అవకాడో పండ్లను దిగుబడి తీసి, మధ్యవర్తులు లేకుండా నేరుగా స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తూ భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. 'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ తన పేరును ప్రస్తావించడం ద్వారా తన జీవితానికి, తన గ్రామానికి మాటల్లో చెప్పలేని గొప్ప గౌరవం దక్కిందని వరదరాజ్ ఆనందం వ్యక్తం చేశారు.

 దేశంలో ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పుల వల్ల ఆరోగ్యకరమైన అవకాడో వంటి పండ్లకు ఆదరణ, డిమాండ్ పెరుగుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నష్టాలెదురైనా ధైర్యంతో సరికొత్త ప్రయోగాలు చేసి విజయం సాధించిన వరదరాజ్ వంటి యువ రైతులు గ్రామీణ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రధాని ప్రశంసలతో పులివెందుల నియోజకవర్గంతో పాటు వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా వరదరాజ్ సాగు విధానంపై తీవ్ర చర్చ నడుస్తోంది.

#ManKiBaat#KadapaFarmer#VaradarajAvocado#Pulivendula#PMModiTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి