Megastar Chiranjeevi: మన టాలీవుడ్ స్టార్ హీరోలు కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలలోనూ ఎంటరవుతున్నారు. మల్టీప్లెక్స్, హోటల్స్, రియల్ ఎస్టేట్ సహా మరెన్నో బడా వ్యాపారాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే, మన టాలీవుడ్లో మల్టీప్లెక్స్ బిజినెస్లో వచ్చిన మహేష్, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ మంచి లాభాలను చూస్తున్నారు. ఇప్పుడు, ఈ లిస్ట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరడం విశేషం.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఏషియన్ సునీల్ మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతుండటం ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. చిరు తన కెరీర్లో మొట్ట మొదటిసారిగా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతుండటం ఆసక్తికరమైన చర్చగా మారింది. హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన మరియు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఈ మల్టీప్లెక్స్ను నిర్మించడానికి స్థలాన్ని కొన్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం, మల్టీప్లెక్స్ నిర్మించేందుకు గానూ అనుమతులను పొందే ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించే విధంగా ఈ థియేటర్లో ఒక ‘ఐమాక్స్’ స్క్రీన్ ని కూడా రూపొందించబోతున్నట్టుగా సమాచారం. సునీల్ నారంగ్ ఫ్యామిలీతో చిరంజీవికి ఎన్నో ఏళ్ళుగా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ రంగంలో వీరు అందిస్తున్న క్వాలిటీ మరియు బిజినెస్ మోడల్ పట్ల ఆకర్షితులైన మెగాస్టార్ ఈ పెట్టుబడికి సిద్ధమయ్యారు. ఇక, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
కాగా, మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే..బాబి కొల్లి దర్శకత్వంలో కాకా చిత్రాన్ని చేస్తున్నాడు. 2027, సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే, విశ్వంభర అనే సోషియో ఫాంటసీ కూడా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు. అలాగే, మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.












