వస్తానంటే వద్దనమా..?
పాకిస్తాన్ ఆశలకు భారత్ బ్రేక్
బ్రిక్స్లోకి దాయాది కంట్రీకి నో ఎంట్రీ
BRICSలోకి అడుగుపెట్టాలని పాకిస్థాన్ ఎప్పటి నుంచో కలలు కంటోంది. ప్రపంచ దక్షిణ దేశాలకు కీలక వేదికగా మారుతున్న ఈ కూటమిలో చోటు కోసం 2023లోనే అధికారికంగా దరఖాస్తు చేసింది. రష్యా, చైనా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించింది. కానీ.. ఇస్లామాబాద్ ఆశలకు ఢిల్లీ దగ్గరే బ్రేక్ పడుతోందా? BRICSలో పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ అభ్యంతరమే అసలు అడ్డంకిగా మారిందా?
BRICSలోకి పాకిస్థాన్ ఎందుకు రావాలనుకుంటోంది?
BRICS అంటే ఒకప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మాత్రమే. ఇప్పుడు ఈ కూటమి విస్తరించింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరడంతో BRICS.. BRICS+గా మారింది.
ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం, కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా ప్రపంచ GDPలో సుమారు 40 శాతానికి ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో BRICSలో సభ్యత్వం అంటే పాకిస్థాన్కు కేవలం దౌత్యపరమైన గుర్తింపు కాదు.. ఆర్థికంగా కూడా పెద్ద అవకాశం.
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. దేశ GDP వృద్ధి రేటు 3.7 శాతంగా నమోదైంది. IMF, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడుతున్న ఇస్లామాబాద్.. ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలను వెతుకుతోంది. BRICSలో చేరితే కొత్త పెట్టుబడులు, అభివృద్ధి నిధులు, వాణిజ్య అవకాశాలు పెరుగుతాయని పాకిస్థాన్ అంచనా వేస్తోంది.
$580 మిలియన్ పెట్టుబడి.. అసలు టార్గెట్ అదేనా?
BRICSలో చేరాలనే పాకిస్థాన్ ప్రయత్నాల వెనుక మరో కీలక వ్యూహం కూడా ఉంది. BRICS ఆధ్వర్యంలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో పాకిస్థాన్ సుమారు 580 మిలియన్ డాలర్ల వాటా కొనుగోలు చేసినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలొచ్చాయి.
దీని వెనుక వ్యూహం స్పష్టమే. వరల్డ్ బ్యాంక్, IMFలపై ఉన్న ఆధారాన్ని కొంత తగ్గించుకోవడం.. BRICS వ్యవస్థలోని ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను అందిపుచ్చుకోవడం.. ఇదే ఇస్లామాబాద్ లెక్కగా కనిపిస్తోంది. అందుకే BRICS సభ్యత్వం పాకిస్థాన్కు ప్రతిష్ఠ కంటే ఎక్కువ.
రష్యా, చైనా ఓకే.. భారత్ మాత్రం నో?
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాకిస్థాన్ BRICSలో చేరేందుకు రష్యా, చైనా వంటి దేశాల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్ రాయబారి కూడా సభ్య దేశాల మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు గతంలో వెల్లడించారు.
కానీ BRICSలో కొత్త సభ్యుడిని చేర్చడం అంత సులభం కాదు. సభ్యత్వ నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాలి. అంటే.. ఒక్క కీలక సభ్య దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా పాకిస్థాన్ ఎంట్రీ ఆగిపోవచ్చు. ఇదే ఇస్లామాబాద్కు ప్రధాన సమస్యగా మారింది.
ఢిల్లీ ‘నో’.. ఇస్లామాబాద్కు బిగ్ బ్రేక్!
భారత్-పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, భద్రతా విభేదాల నేపథ్యంలో.. పాకిస్థాన్ను BRICSలోకి తీసుకోవడంపై భారత్ అనుకూలంగా లేదన్న వాదన బలంగా ఉంది. రష్యా, చైనా వంటి దేశాల మద్దతు ఉన్నా.. భారత్ అంగీకరించకపోతే సభ్యత్వ ప్రక్రియ ముందుకు వెళ్లడం కష్టం. అందుకే పాకిస్థాన్కు BRICS తలుపు దగ్గరే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్కు BRICS ఎందుకు అంత కీలకం?
మరోవైపు BRICS భారత్కు కూడా వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కీలకమైన వేదిక. BRICS దేశాలతో భారత వాణిజ్యం కూడా భారీగా పెరిగింది. ఈ కూటమి దేశాలకు భారత ఎగుమతులు 48.8 శాతం పెరిగి 64.3 బిలియన్ డాలర్ల నుంచి 95.7 బిలియన్ డాలర్లకు చేరాయి.
అంటే BRICSను భారత్ కేవలం దౌత్య వేదికగా చూడటం లేదు. పెరుగుతున్న గ్లోబల్ సౌత్లో తన ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుకునే వేదికగా కూడా ఉపయోగిస్తోంది. అలాంటి సమయంలో పాకిస్థాన్కు సభ్యత్వం ఇవ్వడం వల్ల ఏం లాభం? అనే ప్రశ్న భారత్ ముందున్నట్లు కనిపిస్తోంది.
పాకిస్థాన్ కల నెరవేరుతుందా?
2023లో దరఖాస్తు చేసిన పాకిస్థాన్.. ఇప్పటికీ BRICSలో సభ్యత్వం కోసం ఎదురుచూస్తోంది. ఈ మధ్యలో BRICS విస్తరించింది. కొత్త దేశాలు కూటమిలోకి వచ్చాయి. మరిన్ని దేశాలు సభ్యత్వం కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
మాస్కో మద్దతు.. బీజింగ్ మద్దతు.. ఆర్థిక అవసరం.. భారీ పెట్టుబడులు..! అన్నీ ఉన్నా.. ఢిల్లీ గ్రీన్ సిగ్నల్ లేకపోతే BRICSలోకి ఇస్లామాబాద్ ఎంట్రీ కష్టమే.











