తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో (సెప్టెంబర్ 12, శనివారం) ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఉభయ సభలు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగే అవకాశముంది. నిషేధిత భూముల జాబితా పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-A అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో సమగ్ర పవర్పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్నారు.
విపక్షాల విమర్శలకు బదులివ్వడంతో పాటు గత ప్రభుత్వంలో 22-A పేరుతో జరిగిన భూ అక్రమాలను వెలికితీసి, బాధితులకు ఊరట కల్పించేలా స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం సభ ముందుంచనుంది. అయితే, అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల సమస్యపై చేపట్టే స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సివుంది.
ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి దాదాపు 5లక్షల ఎకరాలను తొలగించామని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఇంకా మిగిలి ఉన్న భూముల క్రమబద్ధీకరణపై సభకు హామీ ఇవ్వనుంది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతల హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సమగ్ర సమాచారాన్ని సభ ముందు ఉంచి, వారిని విమర్శలతో నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సిద్ధమైంది.
చివరి రోజు సమావేశాల్లో 22-A అంశంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యారంగ సమస్యలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు బిల్లులు సభ ఆమోదం పొందే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్, ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఈ ముగింపు రోజు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పవర్పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయ్యాక, సభ్యుల సందేహాలు నివృత్తి చేసిన అనంతరం శాసనసభను అనిశ్చిత వాయిదా వేయనున్నారు.










