కాళీఘాట్లో చేపల భోగ్..
బాబా వ్యాఖ్యలకు సువేందు కౌంటర్?
దుర్గాపూజలో నాన్వెజ్పై మొదలైన వివాదం..
కాళీమాత భోగ్తో కొత్త రాజకీయ చర్చ
బెంగాల్లో ఇప్పుడు ఒక చేప ముక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం చేప కాదు.. బెంగాలీ సంస్కృతికి సంబంధించిన ఒక పెద్ద ప్రశ్నగా మారింది. దుర్గాపూజ వేళ చేపలు, మాంసం తినకూడదంటూ బాగేశ్వర్ ధామ్కు చెందిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి చేపల భోగ్ స్వీకరించడంతో మరో మలుపు తిరిగింది.
కౌశికి అమావాస్య సందర్భంగా కాళీఘాట్ కాళీమాతను దర్శించుకున్న సువేందు అధికారి.. పూజల అనంతరం ఆలయంలో సమర్పించిన భోగ్ ప్రసాదాన్ని స్వీకరించారు. ఆయన ప్లేట్లో చేపల తల, ఫ్రైడ్ ఫిష్, బసంతి పులావ్ కనిపించాయి. ఆ దృశ్యాలు బయటకు రావడంతో.. ఇది కేవలం భక్తి కార్యక్రమమా? లేక ఇటీవలి వివాదానికి ఇచ్చిన రాజకీయ సమాధానమా? అనే చర్చ మొదలైంది.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
ఈ కథ అంతా మొదలైంది దుర్గాపూజకు ముందు బాగేశ్వర్ బాబా చేసిన వ్యాఖ్యలతో. పశ్చిమ బెంగాల్లో హనుమంత్ కథ కార్యక్రమంలో పాల్గొన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి.. దుర్గాపూజ, నవరాత్రుల సమయంలో బెంగాలీ హిందువులు నాన్వెజ్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దుర్గామాత విగ్రహాల సమీపంలో చేపలు, మాంసం విక్రయించకూడదని కూడా అన్నారు. అంతేకాదు.. దుర్గాపూజ సమయంలో నాన్వెజ్ తినే వారిని ‘పాకండులు’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి.
అక్కడితో ఆగలేదు. ఈ వ్యాఖ్యలు బెంగాలీల ఆహారపు అలవాట్లపై మాత్రమే కాదు.. వారి సాంస్కృతిక, మతపరమైన ఆచారాలపై జోక్యంగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఎందుకంటే బెంగాల్లో దుర్గాపూజ అంటే కేవలం ఒక మతపరమైన ఉత్సవం కాదు. అది అక్కడి సంస్కృతిలో భాగం. ముఖ్యంగా శాక్త సంప్రదాయాల్లో ప్రాంతాన్నిబట్టి పూజా విధానాలు, నైవేద్యాలు మారుతూ ఉంటాయి.
బెంగాల్లో చేప.. కేవలం ఆహారం కాదు!
బెంగాలీ వంటకాల గురించి మాట్లాడితే చేపను పక్కన పెట్టడం దాదాపు అసాధ్యం. అయితే ఈ అంశానికి మరో మతపరమైన కోణం కూడా ఉంది. కాళీఘాట్ వంటి శక్తి క్షేత్రాల్లో చేపలు, రొయ్యలు, మేక మాంసం వంటి వాటితో కూడిన భోగ్ సంప్రదాయం కొనసాగుతోంది. భక్తులు దేవతకు సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించే ఆచారం కూడా ఉంది. కాబట్టి బెంగాల్లో ప్రతి హిందూ పూజా విధానం ఒకే రకమైన శాకాహార పద్ధతిలో ఉండదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే కారణంగా ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలు బెంగాల్లో అంత సున్నితమైన అంశంగా మారాయి.
బీజేపీకే ఎందుకు ఇబ్బంది.. ?
ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ మొదలైంది. ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలు వెలువడిన సమయంలో ఆయనతో కలిసి వేదిక పంచుకున్నది కూడా సువేందు అధికారి. సెప్టెంబర్ 4న జరిగిన కార్యక్రమంలో సువేందు.. బెంగాల్లో బాగేశ్వర్ ధామ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని శాస్త్రిని కోరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్వెజ్పై శాస్త్రి చేసిన వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ దుమారం మొదలైంది.
ఇక ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు మొదలుపెట్టాయి. బెంగాల్ సంస్కృతిని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న పాత రాజకీయ ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
బీజేపీ కూడా పరిస్థితిని గమనించింది. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య.. ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, బీజేపీ వాటిని సమర్థించడం లేదని స్పష్టం చేశారు. బెంగాలీలు ఏం తినాలో ఎవరూ నిర్ణయించలేరన్న సందేశాన్ని ఇచ్చారు.
అంటే.. ఒకవైపు హిందుత్వ రాజకీయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలి. మరోవైపు బెంగాలీ సంస్కృతిపై ఎలాంటి ముద్ర పడకూడదు. ఈ రెండింటి మధ్య బీజేపీకి ఈ వివాదం ఇబ్బందికరంగా మారింది.
కాళీఘాట్లో సువేందు ఏం చేశారు?
గురువారం సువేందు అధికారి కోల్కతాలోని కాళీఘాట్ ఆలయానికి వెళ్లారు. కాళీమాతకు పూజలు నిర్వహించారు. పుష్పాలు, బెనారసీ చీర వంటి వాటిని సమర్పించారు. ఆ తర్వాత ఆలయంలోని సంప్రదాయ భోగ్ను ప్రసాదంగా స్వీకరించారు.
ఆ భోగ్లో బసంతి పులావ్తో పాటు చేపల వంటకాలు ఉన్నాయి. చేప తల, ఫ్రైడ్ ఫిష్ను కూడా సువేందు ప్రసాదంగా స్వీకరించారు. ఆ దృశ్యాలు బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం రాజకీయ చర్చగా మారింది.
ధీరేంద్ర శాస్త్రి ‘నాన్వెజ్ వద్దు’ అన్నారు.. సువేందు కాళీఘాట్లో చేపల భోగ్ తిన్నారు. ఇది యాదృచ్ఛికమా? లేక బెంగాల్ ప్రజలకు ఇచ్చిన స్పష్టమైన రాజకీయ సందేశమా?
నేను సనాతన హిందువునే.. కానీ ఇది నా ఆచారం...
కాళీఘాట్ దర్శనం తర్వాత సువేందు అధికారి తన వైఖరిని కూడా స్పష్టం చేశారు. తాను సనాతన హిందువునని.. అష్టమి రోజు పూర్తిగా సాత్విక ఆహారం తీసుకుంటానని చెప్పారు. కార్తీక మాసంలో కూడా సాత్విక ఆహారాన్నే తీసుకుంటానని తెలిపారు.
అయితే బంగాళీగా కాళీమాతకు సమర్పించే చేపల భోగ్ను తాను స్వీకరిస్తానని స్పష్టం చేశారు. అమ్మవారికి సమర్పించే పాఠా బలి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తానని చెప్పారు. కాళీఘాట్లో ఆ రోజు అమ్మవారికి సమర్పించిన చేపల తల, ఫ్రైడ్ ఫిష్ను తానే ప్రసాదంగా తీసుకున్నట్లు తెలిపారు. అంటే ఆయన చెప్పిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. అదే.. సాత్విక ఆహారం ఉంటుంది..
అదే సమయంలో బెంగాల్కు చెందిన శాక్త సంప్రదాయాల్లోని ఆమిష భోగ్ కూడా ఉంటుంది.
ఆహారం మీద పోరాటమేనా?
కాదు. అసలు పోరాటం అంతకంటే పెద్దది. బెంగాల్లో హిందుత్వం ఎలా ఉండాలి? బెంగాలీ సంప్రదాయాలకు హిందుత్వ రాజకీయాలు ఎలా సరిపోవాలి? ఒక ప్రాంతానికి ప్రత్యేకమైన ఆచారాలను దేశవ్యాప్తంగా ఉన్న ఒకే విధమైన మతపరమైన ప్రమాణాలతో కొలవచ్చా? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ చర్చగా మారాయి.
ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యల తర్వాత బీజేపీకి వచ్చిన ఇబ్బంది కూడా ఇదే. బెంగాల్లో హిందుత్వాన్ని బలపరచాలంటే ముందుగా బెంగాలీ సంస్కృతిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదన వచ్చింది. బీజేపీ నేతలు కూడా ఆ దిశగానే స్పందించారు.
చేపల ప్లేట్తో సువేందు ఇచ్చిన రాజకీయ సందేశం?
ఇప్పుడు కాళీఘాట్లో సువేందు అధికారి చేపల భోగ్ స్వీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి.. బెంగాలీ జీవన విధానం, సంప్రదాయాలను పార్టీ గౌరవిస్తుందని, ఈ ఘటనతో వెజ్–నాన్వెజ్ వివాదం ముగియాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అందుకే కాళీఘాట్లో సువేందు చేపల భోగ్ తినడం ఒక సాధారణ ప్రసాద స్వీకరణగా కనిపించినా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దానికి ప్రత్యేక అర్థం ఏర్పడింది. ఒకవైపు బాగేశ్వర్ బాబా చెప్పిన శాకాహార పిలుపు.. మరోవైపు కాళీఘాట్లో చేపల భోగ్ స్వీకరించిన సువేందు అధికారి.
ఒకే హిందూ సంప్రదాయంలో.. రెండు భిన్న ఆచారాలు. అందుకే ఇప్పుడు బెంగాల్లో అసలు చర్చ..
చేప తినాలా? వద్దా? అనేది కాదు. బెంగాల్ను.. బెంగాలీల సంప్రదాయాన్ని.. బెంగాలీలే నిర్ణయిస్తారా?
లేక బయట నుంచి వచ్చే ఆదేశాలు కూడా ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయా? కాళీఘాట్లో సువేందు ప్లేట్లో కనిపించిన ఆ చేప.. ఇప్పుడు ఈ పెద్ద రాజకీయ ప్రశ్నకు ప్రతీకగా మారింది.







