Bandi Sanjay: అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాల మాదిరిగా ఫాంహౌజ్ల చుట్టూ తిరగడం ఏంటని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలొస్తే కాంగ్రెస్కు రాజకీయ నిమజ్జనమే అని అన్నారు.
అధికారంలో ఉన్నది మీరే కదా
ఫాంహౌజ్ వివాదంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న రచ్చను బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. "ఫాంహౌజ్ ఏమైనా ప్రజలు వెళ్లి చూసొచ్చే టూరిస్ట్ కేంద్రమా? అనుమతి లేకుండా ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? అసలు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అక్కడ ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురై ఉంటే, లేదా భూదోపిడీ జరిగి ఉంటే వెంటనే ఆధారాలతో సహా బయటపెట్టి వాటిని స్వాధీనం చేసుకోండి. అంతేకానీ, దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఈ విజిట్లు, హడావుడి దేనికి? ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు విమర్శల కోసం అక్కడికి వెళ్తే అర్థం చేసుకోవచ్చు.. కానీ అధికారంలో ఉండి కూడా ఈ రకమైన విన్యాసాలు చేయడం విడ్డూరంగా ఉంది" అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ములేకనే సుప్రీంకోర్టుకు
ఖైరతాబాద్ ఉప ఎన్నికల అంశంపై స్పందించిన బండి సంజయ్.. క్షేత్రస్థాయిలో ప్రజాగ్రహాన్ని ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్కు లేదని స్పష్టం చేశారు. "ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్కు ఏమాత్రం లేదు. అందుకే ఎన్నికలు రాకుండా ఉండేందుకు భయపడి సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. కానీ ఒక్కసారి ఉప ఎన్నిక అంటూ వస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు రాజకీయంగా నిమజ్జనం చేయడం ఖాయం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అసలు మాకు పోటీయే కాదు. తెలంగాణ గడ్డపై కేవలం బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే అసలైన పోటీ ఉండబోతోంది" అని ధీమా వ్యక్తం చేశారు.
22ఏ నిబంధనలపై న్యాయపోరాటం
రెవెన్యూ రికార్డుల్లోని 22ఏ నిబంధనల వల్ల రాష్ట్రంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల పక్షాన నిలబడి అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. అధికార మత్తులో ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.









