రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కమ్మదనం గురుకులంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అశ్విని అనుమానాస్పద మృతి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా హెచ్ఆర్ కేసు నం. 3641/2026లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను 2026 నవంబర్ 9లోగా సమర్పించాలని ఆదేశించింది.
విద్యార్థిని మృతి ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల భద్రత, సంస్థాగత బాధ్యతలపై సమగ్ర వివరాలను నివేదికలో పొందుపరచాల్సి ఉంది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల నేపథ్యంలో ఘటనకు ముందు, తరువాతి పరిస్థితులు, పర్యవేక్షణ, వైద్య సహాయం, సంబంధిత అధికారుల విధుల నిర్వహణ వంటి అంశాలపై వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. కమిషన్ తదుపరి విచారణను నవంబర్ 9న ఉదయం 11 గంటలకు చేపట్టనుంది. నివేదికను మూడు ప్రతుల్లో సమర్పించాలని నోటీసులో స్పష్టం చేసింది.
ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలు, గౌరవం, భద్రతకు మరింత బలమైన రక్షణ వ్యవస్థ అవసరమని దుండ్ర కుమారస్వామి పేర్కొన్నారు. అశ్విని మృతి ఘటనపై వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు, రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో భద్రత, వసతి గృహాల పర్యవేక్షణ, అత్యవసర వైద్య స్పందన, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం, మానసిక సహాయ వ్యవస్థలపై ప్రత్యేక మానవ హక్కుల ఆడిట్ నిర్వహించాలని ఆయన కోరారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, బాధ్యత నిర్ధారణ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంస్థాగత చర్యలు చేపట్టడమే ఫిర్యాదు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.









