గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని మంగళవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.గురువారం ఏలూరు జిల్లాలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారాలోకేష్ హాజరయ్యారు. ఆళ్ల నాని కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి ప్రకటించారు.లోకేష్ వెంట మంత్రులు నిమ్మల, పార్థసారథి, ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం మంచి వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. నాని డివ్యూటీ సీఎం అయ్యాక శాసనమండలిలో ఆయనతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆయన ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. చాలా హుందాగా ప్రజాసమస్యలపై మాత్రమే మాట్లాడారని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు నిబద్ధతతో సేవ చేసిన వ్యక్తి ఆళ్లనాని అని చెప్పారు.
చాలా క్రమశిక్షణతో నాని రాజకీయాలు చేశారని, ఆయన బతికున్నప్పుడు ఈ విషయం నేరుగా ఆయనతోనే చెప్పానని మంత్రి లోకేశ్ తెలిపారు. నాని కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా అండగా ఉంటామని, అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.ఆళ్ల నాని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వివరించారు.
ఇదిలాఉండగా, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) 57 ఏళ్ల వయసులో విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆళ్ల నానికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వస్థలం ఏలూరు అయినప్పటికీ గత కొంతకాలంగా విశాఖ నగరంలోని సీతమ్మధారలో ఉంటున్నారు. ఏలూరు నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. మాజీమంత్రి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.










