మహిళలను వేధిస్తున్న రాజకీయ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటివి కొన్ని ఘటనలు బయటపడుతుంటే మరికొన్ని బయటకు రావడం లేదు. పరువు కోసం మహిళలు బయటకు రావడం లేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మౌనంగా బరిస్తున్నారని తెలుస్తోంది. సొసైటీ నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, కుటుంబం కోసం మౌనంగా ఉంటూ వేధింపులను బరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లో ఓ మహిళను రాజకీయ నేత వేధించిన ఘటన తాజాగా కలకలం రేపింది. సదరు నేత మహిళను వాట్సాప్లో వేధించడంతో పాటు అసభ్యకర సందేశాలు పంపినట్టు సమాచారం. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సమాజ్ వాదీ పార్టీ మైనారిటీ విభాగం కార్యదర్శి రాజన్ రిజ్వీ తనను వేధిస్తున్నాడని ఓ మహిళా బ్యాంక్ ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. దీనికితోడు తనకు పంపిన మెసేజ్లను మీడియా ముందు పెట్టింది.
రిజ్వీ ప్రతిరోజూ తన వెంటపడుతున్నాడని కన్నీటిపర్యంతమైంది. తోటి ఉద్యోగులను ప్రలోభపెట్టి తన ఫోన్ నంబర్ సంపాదించాడని, అప్పటి నుంచి వేధించడం ప్రారంభించాడని పేర్కొంది. గట్టిగా నిలదీయడంతో బెదిరింపులకు దిగాడని వాపోయింది. సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే తనకు సీఎం కోటాలో కలెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చాడని వెల్లడించింది. వేధింపులు పెరగడంతో ఫొన్ ముట్టుకోవడమే మానేశానని, చివరకు బ్యాంకు వద్దకే వచ్చి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తన కుటుంబ సభ్యులను సైతం టార్గెట్ చేస్తున్నాడని మీడియాకు వివరించింది. రిజ్వీ వేధింపులపై మధురలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. రిజ్వీ పంపిన ఓ మెసేజ్లో ‘మీరు చాలా అందంగా ఉంటారు. మంచి మనసు కూడా ఉంది. మీ వ్యక్తిత్వమూ ఎంతో అద్భుతమైంది. మీరు ఓ కంప్లీట్ ఉమెన్. మీరు చేసే పని మీకు అస్సలు సూట్ కాలేదు. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కోటాలో మీకు ఐఏఎస్ జాబ్ ఇప్పిస్తా’ అని ఉంది. ఈ స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.









