ACB Raids: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయం (STO) లో అవినీతి నిరోధక శాఖ (ACB) సోదాలు కలకలం రేపాయి. ఎస్టీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. బాధితుడి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ట్రెజరీ కార్యాలయం అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఉండగా ట్రెజరీ కార్యాలయం ఉద్యోగులను పట్టుకున్నారు. వారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. లంచం డిమాండ్ చేసిన ఉద్యోగులపై కేసు నమోదు చేసి వారిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
లంచం తీసుకుంటూ ఏటీవో అనురాధ, ఎస్టీవో లక్ష్మయ్య ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఓ రిటైర్డ్ పంచాయతీ సెక్రటరీ పెన్షన్ ఫైల్ క్లియరెన్స్ నిమిత్తం వీరు లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఏటీవో అనురాధ, ఎస్ టీవో లక్ష్మయ్య, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జంగయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సబ్ ట్రెజరీ ఆఫీసులో పని చేసే ఉద్యోగులపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ అధికారులు ఈ మెరుపు రైడ్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫీసులోకి ప్రవేశించిన ఏసీబీ బృందం.. కార్యాలయం తలుపులు మూసివేసి సోదాలు నిర్వహించింది. ట్రెజరీ కార్యాలయంలో పని చేసే సిబ్బంది ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. పలు రికార్డులు, కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించి ఆరా తీశారు.
ట్రెజరీ కార్యాలయం ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకున్న నగదుపై ప్రధానంగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. చేవెళ్ల సబ్ ట్రెజరీ ఆఫీసులో పని చేస్తున్న ఎస్ టీవో లక్ష్మయ్య, ఏటీవో అనురాధ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జంగయ్యను అధికారులు లోతుగా విచారిస్తున్నారు. బిల్లులు, పెన్షన్ ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. లంచాల డిమాండ్ పై అందిన పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు.
అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు. లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా నేరమే అని చెప్పారు.









