Kavitha: బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి టార్గెట్ గా చెలరేగిపోయారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. తండ్రిని, బిడ్డను విడదీయడంలో ప్రశాంత్ రెడ్డిది ప్రధాన పాత్ర అని కవిత ఆరోపించారు. పెద్ద కొడుకులా భావించి ఆయనకి కేసీఆర్ తిండి పెడితే తండ్రిని, బిడ్డని విడదీసి శకునిలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. జీవితంలో హరీశ్ రావునైనా క్షమిస్తాను కానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదిలేది లేదన్నారు కవిత. నా ఉసురు తగులుతుంది అంటూ శాపనార్ధాలు పెట్టారు కవిత. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ ర్యాలీలో కవిత ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంకల్ప సభలో కన్నీరు పెట్టుకున్నారు కవిత. స్వీయ పరిపాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నామని.. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల బతుకులు మారలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు.. కానీ, ఒక్క చుక్క నీరు నిజామాబాద్ కు రాలేదన్నారు. నేను ఏం తప్పు చేశానని నన్ను తీహార్ జైలుకు పంపించారు అని కవిత వాపోయారు. నేను ఏ తప్పు చేయలేదని తేల్చి చెప్పారు. అమ్మ గారు ఇల్లు వెళ్లగొడితే అత్తగారి ఇల్లు ఆదరించిందన్నారు.
దొంగ హామీలతో గద్దెనెక్కిన వాళ్ళని నిలదీయాల్సిన బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? అని కవిత నిలదీశారు. తండ్రినీ, బిడ్డను పాపిన పాపం ప్రశాంత్ రెడ్డి ది.. ప్రశాంత్ రెడ్డి రాజకీయ జీవితం అయిపోయింది అని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిన రెండు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ రెడ్డి చేతులు కలిపారని తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోశ్ రావుని క్షమించినా ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను అని హెచ్చరించారు. 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని కవిత అన్నారు.
షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కోసం పోరాటం చేశామని.. కానీ కోరుట్ల ఎమ్మెల్యే కోసం ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదని ఆరోపించారు. ఏడేళ్లలో ఎంపీ అరవింద్ నిజామాబాద్ కు ఏం చేశారు? అని కవిత ప్రశ్నించారు. ''కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి ఎంపీ అరవింద్, ప్రశాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి మీ అఫిడవిట్లు తీద్దాం. ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయో ప్రజల ముందు పెడతాం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదిస్తున్నారు. అందరి ఎమ్మెల్యేల భరతం పడతాం. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఆలోచించి యూరియా యాప్ రద్దు చేయాలి'' అని కవిత డిమాండ్ చేశారు.









