Mahesh Goud: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం నడిచింది. మంత్రి పదవులపై ఆశావహులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారి విస్తరణ జరిగితే తమకు అమాత్య పదవులు ఖాయం అని ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే, క్యాబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బాంబు పేల్చారు. ఆశాశహుల ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ చర్చించలేదు
మీడియాతో చిట్ చాల్ లో మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అన్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చల్లో మంత్రివర్గం విస్తరణ అంశంపై డిస్కషన్ జరగలేదని తెలిపారు. కేవలం కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపైన మాత్రమే చర్చ జరిగిందన్నారు. క్యాబినెట్ విస్తరణపై హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం లేదని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
అంతా సీఎం రేవంత్ ఇష్టం
మంత్రి మండలి విస్తరణ ఎప్పుడు చేయాలి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టమన్నారు. తనకు మంత్రి పదవి అని జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి సమాచారం లేదన్నారు. కొండా సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామన్నారు. సురేఖ విషయంలో అందరం తమ వంతు ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. సురేఖ విషయంలో ఎవరేం చెప్పినా ఏఐసీసీ మాత్రం ఒప్పుకోలేదన్నారు.
మంత్రి పదవులపై గంపెడాశలు
గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ లో ఇటీవలి తన ఢిల్లీ పర్యటనకు సంబంధించి మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అంశాలపై చిట్ చాట్ లో స్పందించారు. ఈ మధ్య కాలంలో క్యాబినెట్ విస్తరణ లేదా క్యాబినెట్ ప్రక్షాళన కచ్చితంగా ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. అయితే, దీనికి సంబంధించి ఏఐసీసీ వద్ద ఎలాంటి చర్చ జరగలేదని మహేశ్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.
కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ పైనే చర్చ
కేవలం కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్స్ పైనే హైకమాండ్ వద్ద చర్చ జరిగిందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ సమర్పించిన నివేదికపైనే చర్చంతా జరిగిందని ఆయన వివరించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఈ రెండు రోజులు ఈ అంశాలపైనే సుదీర్ఘంగా చర్చ జరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ మహిళ అయిన కొండా సురేఖ అంశంపైనే చాలావరకు డిస్కషన్ నడిచిందన్నారు. కొండా సురేఖను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.. కొండా సురేఖ వల్ల పదే పదే తప్పులు జరుగుతున్నాయని, పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చర్యలు తీసుకోవాల్సిందేనని హైకమాండ్ చెప్పినట్లుగా మహేశ్ గౌడ్ తెలిపారు.
3 ఖాళీలు.. పోటీలో 8మంది
కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో ఆమె ప్లేస్ ను మరొకరితో భర్తీ చేస్తారని, అలాగే క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న మరో రెండు స్థానాలను కూడా భర్తీ చేస్తారని విస్తృతంగా ప్రచారం నడిచింది. ఆ ప్రచారానికి తన వ్యాఖ్యలతో తెరదించేశారు మహేశ్ కుమార్ గౌడ్. కొండా సురేఖ బర్తరఫ్ తో క్యాబినెట్ లో మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు బెర్తులకు దాదాపు అరడజను మందికి పైగా పోటీలో ఉన్నారు. దాదాపు ఏడు నుంచి 8మందికిపైగా నేతలు తమకు మంత్రి పదవి కావాలంటున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుతో సహా పలువురు నేతలు మంత్రి పోస్టు కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. తమ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే, వారందరి ఆశలపై హైకమాండ్ నీళ్లు చల్లిందని చెప్పుకోవచ్చు. కాగా, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అన్నది సీఎం రేవంత్ ఇష్టం అని, అంతా ఆయన చేతుల్లోనే ఉందని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం విశేషం.








