సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో నకిరేకల్లో.. పొలిటికల్ హీట్ పెరిగినంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.. ఈ క్రమంలో ఆయన తన నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నకిరేకల్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు..
ఇసుక, మట్టి మాఫియాతో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన అభివృద్ధి పనులను మాత్రమే ప్రారంభిస్తున్నారని, ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా... నియోజకవర్గంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. నకిరేకల్లో రోడ్లు, మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని మండిపడ్డారు..
ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని... అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కృష్ణా నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించకుండా... ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగానికి అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తే... రైతులతో కలిసి సాగర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇక గతంలోనూ నకిరేకల్లో సాగునీరు, రోడ్లు, అభివృద్ధి పనులు, రైతుల సమస్యలు ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఇప్పుడు సీఎం పర్యటన సమయంలోనే ఈ అంశాలను మరోసారి తెరపైకి తీసుకురావడంతో.. నకిరేకల్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. తన నియోజకవర్గ సమస్యలను నేరుగా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వడం లేదని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఈ నియోజక వర్గంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నకిరేకల్లో అధికార కాంగ్రెస్కు, ప్రతిపక్ష నేతలకు మధ్య రాజకీయ పోరు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. సీఎం పర్యటనతో అభివృద్ధిపై చర్చ జరగాల్సిన సమయంలో... హౌస్ అరెస్ట్, ఆరోపణలు, కృష్ణా జలాల డిమాండ్తో ఒక్క సారిగా రాజకీయం హిటేక్కింది.








