Ramchander Rao : తెలంగాణలో వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో అప్పుడే హీట్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రధాన పార్టీల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న వేళ.. పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకోబోతుందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
ఈ స్థానానికి కమలం గుర్తుపై పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు పార్టీ పెద్దలను కలిసి తమ అభ్యర్థిత్వంపై లాబీయింగ్ చేస్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సమయంలో.. గతంలో ఇదే స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మరోసారి బరిలోకి దింపే అంశంపై పార్టీ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే రామచంద్రరావు మాత్రం తాను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో లేనని, పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన పేరు రేసులో వినిపిస్తూనే ఉండటం రాజకీయ వర్గా్ల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో ఇదే స్థానం నుంచి గెలుపొందడం, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలవడం, నియోజకవర్గంపై ఉన్న పరిచయం, గుడ్విల్ వంటి అంశాలు ఆయనకు ఈసారి ఎన్నికల్లో కలిసి వచ్చే అంశాలుగా పని చేస్తాయని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు టికెట్ కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారికి చెక్ పెట్టేందుకు రామచంద్రరావునే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ పాలిత పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా చట్టసభల ప్రతినిధులు కొనసాగుతున్న విషయాన్ని కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు నోటిఫికేషన్ ఈ నెలలో వెలువడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఆశావహుల ప్రయత్నాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం చివరకు ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.
రామచంద్రరావు పేరు ఫిక్స్ ప్రస్తుతం టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆశావహుల పరిస్థితి ఏంటి? ఆయన పోటీకి సిద్ధపడకపోతే బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు కమలం శిబిరంలో ప్రముఖంగా చర్చకు వస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటి నుంచే రాజకీయ వేడి మొదలైనట్లు కనిపిస్తోంది.









