తెలంగాణ

Telangana: ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..

రచన: Venu6 నిమిషాల పఠనం

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. కాంగ్రెస్‌లో మాత్రం రేసు ఇప్పుడే మొదలైంది. ఆశావహుల లాబీయింగ్‌కు తెరలేచింది.. పేర్లు వినిపిస్తున్నాయి.. సమీకరణాలు మారుతున్నాయి. మరి ఈ రేసులో ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరికి గవర్నర్ కోటా అవకాశం లభిస్తుంది? చివరికి హస్తం అధిష్టానం ఎవరిపై నమ్మకం ఉంచుతుంది?

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా ఇంకా మోగలేదు.. నోటిఫికేషన్‌కు మరో నాలుగు నెలల సమయం ఉంది.. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.. ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల లాబీయింగ్‌తో హస్తం శిబిరంలో సందడి మొదలైంది. ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎవరిని అధిష్టానం పక్కన పెడుతుంది? అన్న చర్చలు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.

ముఖ్యంగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. సురభి వాణీదేవి, చింతపండు నవీన్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ రెండు స్థానాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక మహబూబ్‌నగర్, రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కాంగ్రెస్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది.

సామా రామ్మోహన్ రెడ్డి, గాలి హర్షవర్ధన్, బి. వేణుగోపాల్, గౌరీశంకర్.. టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీతో ఉన్న అనుబంధం, ప్రజల్లో పరిచయం, గతంలో చేసిన రాజకీయ కార్యక్రమాలు.. ఇవన్నీ టికెట్ ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

గుత్తా అమిత్ రెడ్డి, పున్న కైలాశ్ నేత, చనగాని దయాకర్, లోక్ యాదవ్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. ఒక్కో నేత తమకు ఉన్న రాజకీయ పరిచయాలు, పార్టీ సంబంధాలు, సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకుని అధిష్టానం వద్ద తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కేవలం పార్టీ విధేయతనే కాకుండా.. విద్యావంతులు, ఉద్యోగులు, యువతలో అభ్యర్థికి ఉన్న ఆదరణను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

దీంతో చివరి నిమిషం వరకు ఈ రేసులో ఎవరి పేరు ప్రకటిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కూడా కాంగ్రెస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో నాలుగు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో.. ఈ నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రేసులో అయోధ్య రెడ్డి, సత్తు మల్లేశ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న బస్వరాజు సారయ్య పేరు అనూహ్యంగా తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్‌లో నెలకొన్న చిత్ర విచిత్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తారా? సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తారా? లేక ముఖ్య నాయకత్వానికి నమ్మకమైన వ్యక్తులకు అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఎమ్మెల్సీ పదవులు కేవలం రాజకీయ గౌరవంగా కాకుండా.. పార్టీలో భవిష్యత్ రాజకీయ ప్రాధాన్యతకు సంకేతంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఆశావహుడు తనదైన మార్గంలో అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే చివరికి నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం, పార్టీ అధిష్టానం ఆలోచన, సామాజిక-ప్రాంతీయ సమీకరణాలపైనే ఆధారపడి ఉండొచ్చనే చర్చ సాగుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. కాంగ్రెస్‌లో మాత్రం రేసు ఇప్పుడే మొదలైంది. ఆశావహుల లాబీయింగ్‌కు తెరలేచింది.. పేర్లు వినిపిస్తున్నాయి.. సమీకరణాలు మారుతున్నాయి. మరి ఈ రేసులో ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎవరికి గవర్నర్ కోటా అవకాశం లభిస్తుంది? చివరికి హస్తం అధిష్టానం ఎవరిపై నమ్మకం ఉంచుతుంది? తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ ఎమ్మెల్సీ పదవులు ఎలాంటి కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తాయన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

#Telangana#Congress#MLC Elections#Governor Quota MLC#Revanth Reddy#Chinthapandu Naveen#Ayodhya Reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి