టాలీవుడ్లో సినిమా హిట్ అయితే.. థియేటర్ల దగ్గరే కాదు, సోషల్ మీడియాలో కూడా పండగ జరుగుతుంది.. కానీ కొన్ని విజయాలకు మాత్రం ఇండస్ట్రీలో ఓ విచిత్రమైన సైలెంట్ మోడ్ ఆన్ అవుతున్నట్టుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటనే చోటు చేసుకుందనే టాక్ వినిపిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది.
అంతేకాదు మెగా కాంపౌండ్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి ప్రోత్సాహం లభించింది. పవన్ కల్యాణ్ స్పందించారు. చిరంజీవి చిత్రబృందాన్ని ఇంటికి ఆహ్వానించి అభినందించారు. రవితేజను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సందర్భంలో కనిపించారు. కాగా ఈ చిత్రం విడుదలై దాదాపు నెల రోజులు అవుతోంది. కానీ ఇప్పటి వరకు టాలీవుడ్లోని మిగతా సెలబ్రిటీల ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఎందుకు సైలెంట్ అయ్యాయో సాగతి ప్రేక్షకుని అర్థం కావడం లేదట..
ప్రస్తుతం ఇరుముడి మూవీ సక్సెస్కు సంబంధించిన అభినందనలు ఆశించిన స్థాయిలో సినీ వర్గాల పెద్దల నుండి కనిపించడం కష్టమే అన్నట్టుగా పరిస్థితి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు సినిమా ఫ్లాప్ అయితే మాత్రం విశ్లేషణలకు కొదవ ఉండదు. ఎవరి సినిమా ఎందుకు పోయింది? కంటెంట్లో ఏం లోపం ఉంది? బడ్జెట్ ఎందుకు పెరిగింది? ప్రమోషన్ ఎందుకు తగ్గింది? అంటూ చర్చలు మొదలవుతాయి.
కానీ సినిమా హిట్ అయితే మాత్రం.. సైలెంట్ పాలసీ ఎందుకు అనే ప్రశ్నలు ఆడియన్స్ నుండి వినిపిస్తున్నాయి. ఇక ఇండస్ట్రీ ఒక కుటుంబం అంటారు. కుటుంబంలో ఒకరికి మంచి మార్కులు వస్తే.. మిగతావాళ్లు కనీసం కంగ్రాట్స్ అయినా చెబుతారు. ఇక్కడ మాత్రం సినిమా హిట్ అయినా.. కొందరి నుంచి స్పందన రావడానికి బహుశా ప్రత్యేకమైన అపాయింట్మెంట్ అవసరమేమో!..
ఇటీవల టాక్సిక్ విషయంలో యశ్కు కోలీవుడ్ నుంచి పలువురు స్టార్లు బహిరంగంగా మద్దతు తెలిపారు. అక్కడ ఇండస్ట్రీ అంటే కలిసి నిలబడటం కనిపించింది. మరి టాలీవుడ్ లో అలాంటి సందర్భం వస్తే.. ఎవరు ముందుకొస్తారు? ఎవరు పోస్టు పెడతారు? ఎవరు కనీసం ఒక హార్ట్ ఎమోజీ వేస్తారు? అని ఎదురుచూసే పరిస్థితులు నెలకొనడం విచిత్రం అంటున్నారు. గతంలో మహానటి వంటి సినిమాలు విజయం సాధించినప్పుడు ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
చిన్న సినిమా హిట్ అయినా కొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి సక్సెస్ను సెలబ్రేట్ చేశారు.. మరి ఇప్పుడు ఏమైంది?.. ఇరుముడి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్లకు సినిమా నచ్చింది.. వాళ్లు టికెట్లు కొన్నారు.. థియేటర్లకు వెళ్లారు.. విజయాన్ని ఇచ్చారు. అంటే ప్రేక్షకులు తమ పని చేసేశారు.
ఇప్పుడు ఇండస్ట్రీ చేయాల్సింది ఒక్కటే.. తోటి సినిమాకు ఒక చిన్న అభినందన చెప్పడం. టాలీవుడ్ నిజంగా ఒక కుటుంబమైతే.. ఆ కుటుంబంలో విజయాలు కూడా అందరివే కావాలి. లేదంటే మేమంతా ఒక్కటే అనే డైలాగ్ మాత్రం సినిమా టైటిల్ కార్డులకే పరిమితమైపోయే ప్రమాదం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..








