మన మనస్సులోని గాఢమైన కోరిక నెరవేరినప్పుడు, ఆ తథాస్తు దేవతలు మన అభీష్టాన్ని ఆలకించి దీవించారు అని భక్తులు నమ్ముతారు. మన సంకల్పం ఎంత పవిత్రంగా ఉంటుందో, విశ్వంలో సంచరించే తథాస్తు దేవతల దివ్యానుగ్రహం కూడా అంత త్వరగా దానికి రూపాన్ని ఇస్తుందనే విశ్వాసం హిందూ ధర్మంలో ఉంది.. అందుకే తథాస్తు అనే పదం ప్రతి భక్తునికి సుపరిచితం అయ్యింది.
అయితే తథాస్తు దేవతలు అంటే ఎవరూ?.. వారికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి? అనే విషయం మనలో చాలా మందికి తెలియదు.. ఇక శాస్త్రాలు, పండితులు చెబుతున్న ప్రకారం.. తథాస్తు దేవతలను అశ్విని దేవతలు అని పిలుస్తారు. సూర్య భగవానుడు, సంధ్యాదేవి అశ్వ రూపంలో ఉన్నప్పుడు జన్మించిన నాసత్యుడు, దశ్రుడు అనే కవలలే ఈ అశ్విని దేవతలు. వీరు అత్యంత సౌందర్యవంతులు మాత్రమే కాదు, దేవతలకు వైద్యులుగా సేవలు అందించే మహా ప్రావీణ్యులు. వృద్ధుడైన చ్యావన మహర్షికి తిరిగి యవ్వనాన్ని, చూపును ప్రసాదించింది వీరే అని మన ప్రాచీన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలలో వివరంగా పేర్కొనబడింది..
ఇక మహాభారతంలో పాండురాజు భార్య మాద్రి దేవి ఈ అశ్విని దేవతలను ఉపాసించడం వల్లనే నకులుడు, సహదేవుడు జన్మించారని చెబుతారు.. తండ్రులైన అశ్విని దేవతల అనుగ్రహంతోనే నకుల సహదేవులు భూమండలంలోనే సాటిలేని సౌందర్యవంతులుగా, విద్యానిధులుగా ప్రసిద్ధి చెందారు. కురుక్షేత్ర యుద్ధంలో నకులుని దివ్యమైన రూపం, ప్రశాంతమైన ముఖతేజస్సు శత్రువులను సహితం మంత్రముగ్ధులను చేసేదని.. నకులుడు విసిరే బాణాలు, ఆయన రథం నడిపే వేగం ఎంత వేగంగా ఉండేదంటే శత్రువులకు ఆయన ఏ దిక్కు నుంచి దాడి చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు. దీనినే 'నకుల యుద్ధ శైలి' అని పిలిచేవారు. కాగా ఈ విషయాలను మార్కండేయ, పద్మ పురాణాలు వివరిస్తున్నాయని చెబుతారు..
అలాగే ఈ అశ్విని దేవతలకు తథాస్తు దేవతలు అనే పేరు రావడానికి ఒక విశేష ఆధ్యాత్మిక కారణం ఉందని పేర్కొంటారు. అశ్విని దేవతలు ప్రతిరోజూ సంధ్యా సమయాల్లో ఆకాశ మార్గాన సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో మానవులు పదే పదే మనస్సులో అనుకునే ఆలోచనలను, నోటి వెంట అనే మాటలను వీరు వింటారు. అవి మంచివైనా, చెడువైనా "తథాస్తు" అంటే "అట్లే అగుగాక" అని దీవిస్తారు. వీరు ఒక్కసారి తథాస్తు అని దీవిస్తే ఆ మాట తప్పక జరిగి తీరుతుందని మన సనాతన ధర్మ విశ్వాసం..
అందుకే మన పెద్దలు సాయంత్రం వేళల్లో నిందలు, కోపాలు, చెడు మాటలు మాట్లాడకూడదని హెచ్చరిస్తారు. ఆ పవిత్ర సమయంలో భగవన్నామాన్ని స్మరిస్తూ, శుభప్రదమైన మాటలు మాట్లాడితే, అశ్విని దేవతల దివ్య అనుగ్రహంతో మన జీవితంలో సకల శుభాలు నెరవేరుతాయని చెబుతారు.. ఇక భారతీయ ఆధ్యాత్మిక తత్వంలో వాక్కుకు శక్తి ఉందని భావిస్తారు. ఎక్కువ సార్లు మనం ఏదైతే జరగాలని కోరుకుంటామో అది మన మనస్సులో బలమైన సంస్కారంగా మారుతుంది.
ఆ సంస్కారం మన ప్రవర్తనను, నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఇదే తథాస్తు దేవతల భావనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక బోధ.. అందుకే వాక్కును, ఆలోచనను పవిత్రంగా ఉంచుకో.. ఎందుకంటే మనం పదే పదే పలికేది చివరికి మన జీవితాన్ని నడిపించే భావంగా మారవచ్చు. ఇక మాట మంచిదైతే మంగళం.. మనసు మంచిదైతే జీవితం కూడా మంగళమే అని ఊరికే అనలేదు మనపెద్దలు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.










