రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితా గురించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది.కమీషన్ల కోసమే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22 A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి, సిగ్గులేకుండా టోల్ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడు. టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే బాధితుల నంబర్లు తీసుకుని, ఒక వారం రోజులకు వాళ్లకు బ్రోకర్ గాళ్లు ఫోన్ చేస్తారు. నీకున్న భూమిలో కొంత మాకు రాసిస్తే, నీ భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని చెప్తారు. ప్రభుత్వ అధికారులకు కూడా తెలియకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ద్వారా మన భూములను వేరే వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు’అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఇదిలాఉండగా, గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 22 ఏ విషయంలో జరిగిన తప్పిదాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే.. అధికారుల తప్పిదం వలన పట్టా భూములు సైతం 22 ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లాలయన్నారు. కొందరు న్యాయబద్ధంగా కొన్న ఆస్తులు కూడా 22A కింద బ్లాక్ లిస్ట్లో పెట్టామని, అలా న్యాయబద్ధంగా, కష్టార్జితంతో కొన్న ఆస్తులు బ్లాక్ లిస్ట్లో ఉంటే మా టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని కోరారు.
అందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 18005994788ను ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టా ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, గత నలభై ఏండ్లుగా నివాసం ఉంటున్న భవనాలు, ప్లాట్లు నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని భూ బాధితులు.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని.. తమకు ఆదేశాలు రాలేదని మాటదాటేస్తున్నారని మండిపడుతున్నారు.








