Harish Rao: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములు ఇస్తే.. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి వాటిని లాక్కుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా 22ఏపై పోరాటం చేస్తామని ప్రకటించారు. సిర్పూర్ బీఆర్ఎస్ సభలో హరీశ్ రావు మాట్లాడారు.
కొండా సురేఖ బర్తరఫ్ అంశంపైనా హరీశ్ రావు స్పందించారు. సీఎం రేవంత్ ను తిట్టారని కొండా సురేఖ పై చర్యలు తీసుకున్నారని చెప్పారు. మరి నిషేధిత భూముల పేరుతో ప్రజలను పట్టిపీడిస్తున్న పొంగులేటిపై చర్యలు ఏవి? అని హరీశ్ రావు నిలదీశారు. రేవంత్ తో పొంగులేటికి ఏం పొత్తుందో చెప్పాలన్నారు.
22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో ప్రజలను రేవంత్ సర్కార్ వేధిస్తోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సిర్పూర్ నియోజకవర్గంలోనే 42వేల 867 ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని హరీశ్ ఆరోపించారు. సీఎం రేవంత్ ఇల్లు కూడా 22ఏలోనే ఉందన్నారు. మంత్రి పొంగులేటి అసెంబ్లీకి రాకుండా నిషేధించాలన్నారు.
నిషేధిత జాబితాలో పెట్టిన పేదల భూములను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పేదల భూములను రిలీజ్ చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.








