రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోరిక తీర్చడం కోసం ఓ యువకుడు తన జీవితాన్ని రిస్కులో పడేసుకున్నాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు తెలిసి తెలియని వయసులో చేసే చిన్న తప్పులు వారిపై నేరస్తుడు అనే ముద్ర పడేలా చేస్తున్నది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మత్తు వినియోగం భారీగా పెరిగింది. విద్యార్థులే అత్యధికంగా మత్తుకు బానిస అవుతున్నారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ చానెల్స్,సోషల్ మీడియాలో కోడ్ లాంగ్వేజ్ ద్వారా గుట్టుగా మత్తు పదార్థాలు పొందుతున్న కొందరు.. మాదకద్రవ్యాలు సేవించిన తర్వాత నషాలో ఉండి ఎలాంటి పనులు చేస్తున్నారో వారికి తెలియడం లేదు.కొందరు దొంగతనాలు, అత్యాచారాలు, దాడులకు పాల్పడి పోలీసులకు చిక్కుతున్నారు. ఫలితంగా వారి అందమైన జీవితం నాలుగు గోడల మధ్య నలిగిపోవాల్సి వస్తున్నది.కొందరు మత్తుకు బానిసలుగా మారుతుంటే.. మరికొందరు ఈజీ మనీ కోసం మాదకద్రవ్యాలు సరఫరా చేసే వృత్తిని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.
తాజా ఘటన ఇందుకు అద్దం పడుతోంది.ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఆమె కోరిక తీర్చేందుకు ఓ యువకుడు గంజాయి సప్లయర్గా అవతారమెత్తాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య.. హేమలత ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఒడిశాకు వెళ్లి రూ.16 వేలకు 12 కేజీల గంజాయి కొనుగోలు చేసిన చైతన్య.. హైదరాబాద్కు వస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో అతని ప్రియురాలు కూడా ఉన్నట్టు సమాచారం.
రూ.16 వేలకు కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్లో రూ.6 లక్షలకు అమ్మాలని ఈ జంట నిర్ణయించుకున్నట్టు సమాచారం. వచ్చిన డబ్బులతో ప్రియురాలికి ఐఫోన్ కొనివ్వాలని ఆ యువకుడు అనుకున్నట్టు తెలిసింది. ఒడిశా నుంచి గంజాయి తీసుకుని వస్తుండగా.. ఖమ్మం జిల్లా వైరా వద్ద పోలీసులు పట్టుకోని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. కాగా, వీరితో టచ్లో ఉన్న గంజాయి ముఠాలో మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, పట్టుబడిన జంటపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.








