మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క తాజాగా కౌంటర్ ఇచ్చారు. తన మంత్రి పదవి పోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, మరి కొందరు కుట్ర చేశారని, హైకమాండ్ను ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేశారని కొండా సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్పై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.
బ్లాక్ మెయిల్కు భయపడేంత బలహీనంగా అధిష్టానం లేదని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టంచేశారు. ఆదివారం ఉదయం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాల్సిందేనని నొక్కిచెప్పారు. పార్టీ నిర్ణయాల విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు.
క్రమశిక్షణతోనే పార్టీకి గౌరవం ఉంటుందని, సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు భుజాలు ఎగరేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవితను ఎందుకు బయటకు పంపారో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా సమాధానం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తామంతా కలిసి పనిచేస్తామని మంత్రి స్పష్టంచేశారు.
ఇదిలాఉండగా, కాంగ్రెస్ హైకమాండ్కు తనను మంత్రి పదవి నుంచి తొలగించడం ఇష్టం లేదని, సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేయడం వల్లే తనను బర్తరఫ్ చేశారని కొండా సురేఖ మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే. తన పదవి పోవడం వెనుక సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, సీఎం సోదరులు తిరుపతి, కొండల్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. మంత్రివర్గంలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, తన మాజీ ఓఎస్డీ సుమంత్ను కూడా కావాలనే ఇరికించారని మాజీ మంత్రి ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతానని ప్రకటించారు. దీనికి తోడు నిన్న ఫేస్బుక్లో ఆసక్తికర పోస్టు పెట్టిన కొండా సురేఖ.. త్వరలోనే తన పొలిటికల్ కెరీర్ మీద బిగ్ అప్డేట్ ఇస్తానని.. వెయిట్ చేయాలని హింట్ ఇచ్చారు.









