Khairatabad By Poll: హైదరాబాద్ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు పడటంతో ఈ సెగ్మెంట్లో బైపోల్ అనివార్యంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రాబోయే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ పోరు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా బీఆర్ఎస్కి చావో రేవో సమస్యగా మారింది. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఫలితాల నేపథ్యంలో.. ఈసారి ఎలాగైనా ఖైరతాబాద్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో గులాబీ దళం ముమ్మర కసరత్తు చేస్తుంది.
తలసాని తనయుడి ఎంట్రీ..
ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్గా మారిన అంశం తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ అభ్యర్థిత్వం. ఖైరతాబాద్ టికెట్ను తన కుమారుడికి కేటాయిస్తే గెలిపించుకుని వస్తానని తలసాని అధిష్టానం వద్ద గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో సంక్రాంతి వేడుకల సందర్భంగా నియోజకవర్గంలో దానం, తలసాని వర్గాల మధ్య తీవ్ర పోటీ వాతావరణం కనిపించింది. ఇప్పుడు ఉప ఎన్నిక ముంచుకొస్తుండటంతో దానం నాగేందర్ను ఢీకొట్టేందుకు సాయికిరణ్ను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే ఖైరతాబాద్ పోరు కాస్తా 'దానం వర్సెస్ తలసాని' ప్రత్యక్ష యుద్ధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేసులో విష్ణువర్ధన్ రెడ్డి, దాసోజు శ్రవణ్.. పోటాపోటీ
తలసాని కుమారుడితో పాటు పార్టీలో మరికొందరు సీనియర్ నేతలు కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. పీజేఆర్ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, నియోజకవర్గంలో పాత పరిచయాలు తమకు కలిసివస్తాయని ఆయన వర్గం ఆశిస్తోంది.
మరోవైపు గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దాసోజు శ్రవణ్ కూడా రేసులో ఉన్నారు. స్థానికంగా ఉన్న అనుబంధంతో పాటు బలమైన బీసీ ఓటు బ్యాంక్ తనకు అనుకూలంగా మారుతుందని శ్రవణ్ భావిస్తున్నారు.
వీరితో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న మన్నే గోవర్ధన్ రెడ్డి సైతం తనకు లేదా తన భార్యకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
సుప్రీంలో దానం పోరాటం..
అనర్హత వేటుపై దానం నాగేందర్ ఇప్పటికే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయపోరాటం ఒకవైపు నడుస్తున్నప్పటికీ, ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని దానం స్పష్టం చేస్తున్నారు.
"ఖైరతాబాద్లో దానం నాగేందర్ అంటే ఒక బ్రాండ్.. పదవులు వస్తుంటాయి పోతుంటాయి.. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండే పోరాట యోధుడిని" అంటూ ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
స్థానిక బలం, క్యాడర్ను ముందుకు నడిపించే సామర్థ్యం, సర్వేల ఫీడ్బ్యాక్ ఆధారంగానే బలమైన అభ్యర్థిని ఖరారు చేయాలని బీఆర్ఎస్ భావిస్తుండటంతో, ఖైరతాబాద్ గులాబీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.








