IndiGo Fare Hike: ఇండిగో ప్రయాణికులకు గట్టి ఝలక్ ఇచ్చింది. చిన్న పిల్లల టికెట్ ఛార్జీలతో పాటు ఎక్స్ట్రా లగేజీ, ఇతర సేవల ధరలను భారీగా పెంచుతూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్ ధరలు మండిపోతుండగా, ఈ తాజా పెంపు విమాన ప్రయాణికులపై మరింత భారాన్ని మోపనుంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
రెండేళ్ల లోపు పసిపిల్లలకు ఇప్పటి వరకు రూ.2,000 వసూలు చేయగా, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.3,000కి పెంచారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే ఈ చిన్నారులకు ప్రత్యేకంగా సీటు కేటాయించకపోయినా ఇకపై ఈ రేటు కట్టాల్సిందే. ఏటా దాదాపు 10 లక్షల మంది పసిపిల్లలు ఇండిగోలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క సర్వీస్ ద్వారానే సంస్థకు రూ.90 కోట్ల వరకు ఎక్స్ట్రా లాభం రానుంది.
మరోవైపు విమానంలో అదనంగా తీసుకెళ్లే లగేజీ ఛార్జీలను కూడా కిలోకు రూ.100 మేర పెంచింది. ఇప్పటి దాకా అదనపు బరువుకు కేజీకి రూ.700 చెల్లిస్తుండగా, ఇకపై రూ.800 కట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు పెద్దల తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించే మైనర్ల కేర్ సర్వీస్ ఫీజును రూ.5,000 నుంచి రూ.5,999 గా నిర్ణయించింది. అలాగే ఎయిర్పోర్టుల్లో ప్రయారిటీ చెక్-ఇన్, బోర్డింగ్ ఫీ ని రూ.450 నుంచి రూ.650కి, ట్రావెల్ సర్టిఫికెట్ రేటును రూ.200 నుంచి రూ.300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.








