గంజాయి కేటుగాళ్లకు అడ్డాగా మారిన హైదరాబాద్లో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది.. ఇటీవల అరెస్టయిన అంగూరీబాయి, శుభంసింగ్ల విచారణతో గంజాయి క్వీన్ నీతూబాయి అక్రమ సామ్రాజ్యం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో డ్రగ్స్ సామ్రాజ్యానికి, హవా మార్గాల ద్వారా సాగుతున్న అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది..
నగరంలో కలకలం రేపుతున్న గంజాయి డాన్ రీతు భాయ్ అలియాస్ నీతు భాయ్ అడ్డాపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.. గురువారం తెల్లవారుజాము నుంచే ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు ప్రారంభించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న రీతు భాయ్ నివాసాలు, వ్యాపార సంస్థలతో పాటు ఆమె ప్రధాన అనుచరుల ఇళ్లే లక్ష్యంగా మొత్తం ఎనిమిది చోట్ల ఈ సోదాలు జరిగాయి.
కాగా గతంలో రీతు భాయ్పై తెలంగాణ ఎక్సైజ్ శాఖ పలు కేసులు నమోదు చేసింది. గంజాయి స్మగ్లింగ్ ద్వారా కోట్లాది రూపాయల అక్రమార్జన కుడబెట్టినట్లు ఎక్సైజ్ శాఖ ఆధారాలు సేకరించింది. అయితే, ఈ కేసు కేవలం డ్రగ్స్ విక్రయాలకే పరిమితం కాలేదని, దీని వెనుక భారీ హవాలా దందా నడుస్తోందని తేలడంతో ఈడీ రంగ ప్రవేశం చేసింది. మరోవైపు గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును రీతు భాయ్ హవాలా రూపంలో మార్చుకుంటూ, బినామీ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించింది.
ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులనే ప్రాతిపదికగా తీసుకుని, ఈ మనీ లాండరింగ్ కోణాన్ని వెలికి తీసేందుకు ఈడీ అధికారులు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు, హవాలా లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయ్యే సరికి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..
మరోవైపు ధూల్పేట నుంచి నానక్రామ్గూడకు చేరిన ఈమె కుటుంబం.. గుడుంబా దందా నుంచి గంజాయి ఫ్యామిలీ బిజినెస్గా రూపాంతరం చెందింది. భర్త మున్నూ సింగ్, ఇద్దరు కుమారులతో కలిసి రోజుకు 2 నుంచి 4 లక్షల రూపాయల సరుకు అమ్ముతున్నట్లు సమాచారం.. ఒడిశా నుంచి కిలో 8 వేలకు గంజాయి తెచ్చి.. 5 గ్రాముల పొట్లాన్ని 500 రూపాయలకు ఈ ముఠా ఐటీ కారిడార్ ఉద్యోగులకు విక్రయిస్తోందని అధికారులు గుర్తించారు..
ఇక గత ఎనిమిదేళ్లలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన నీతూబాయిపై ఇప్పటికే 19కి పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాది 4 కోట్ల ఆస్తులు, ఈ ఏడాది మార్చిలో 22.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల నుంచి తప్పుకునేందుకు ఈ లేడీ డాన్ ఇంటి నుంచి డ్రైనేజీకి సీక్రెట్ టన్నెల్, చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంది... మొత్తానికి ఇలా ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ కోట్లు పోగేసి గంజాయి క్వీన్గా వెలుగు వెలుగుతోన్న రీతు భాయ్ మీద పీడీ యాక్ట్ కింద కేసులు నమోదైనట్టు సమాచారం..










