ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా..?
ఇవాళ ఢిల్లీలో ఏం జరగనుంది..?
దేశ రాజధానిలో టెన్షన్.. టెన్షన్
భారీ ఆందోళనలకు సిద్ధమవుతున్న సీజేపీ
దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ పట్టు వీడడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. దీంతో ఢిల్లీ సహా దేశమంతా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాటి సమావేశంలోనూ మంత్రులు సీజేపీ ప్రతినిధులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఇవాళ నిర్ణయం చెబుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరికొద్ది గంటల్లో ఏం జరగనుందనేది తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.
మరోసారి చర్చలు...!
శుక్రవారం కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ సీజేపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. సీజేపీ మొత్తం మూడు డిమాండ్లను కేంద్రం ముందు పెట్టింది. అందులో రెండు డిమాండ్లకు దాదాపు ఓకే చెప్పింది కేంద్రం. ఒక్క డిమాండ్ దగ్గరే పీటముడి పడినట్టు తెలుస్తోంది.
సీజేపీ 3 డిమాండ్లు...
1. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
2. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి.
3. ఆందోళన చేస్తున్నవిద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే రద్దు చేయాలి.
ఈ మూడు డిమాండ్లలో మొదటి డిమాండే కీలకమైంది. ఈ విషయంలో కేంద్రం నుంచి సీజేపీ ప్రతినిధులకు ఎలాంటి హామీ లభించలేదు. మిగిలిన రెండు డిమాండ్లపై సానుకూలంగానే స్పందించింది. ఐతే మొదటి డిమాండ్ విషయంలో తగ్గేదే లేదని తేల్చిచెప్పింది కాక్రోచ్ జనతా పార్టీ. ఈ మీటింగ్ ముగియగానే నేరుగా జంతర్మంతర్ వేదిక వద్దకు చేరుకున్నారు ఆ పార్టీ ప్రతినిధులు. ఆందోళనకారుల సమక్షంలోనే మరోసారి కేంద్రానికి స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చారు. 1-2 రోజుల్లో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, లేదంటే కేంద్రమే ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరోసారి భారీ ఆందోళన తప్పదని హెచ్చరించారు.
సీజేపీ ఏం చేయనుంది..?
ఇప్పుడు దీనిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీజేపీ తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్న దానిపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్రమేమో.. మంత్రి రాజీనామా విషయంలో స్పందించడం లేదు. కేంద్ర పెద్దల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవచ్చు. ప్రజలు మాకు మెజారిటీ ఇచ్చినప్పుడు మేమెందుకు రాజీనామా చేయాలని కేంద్రం వాదిస్తున్నట్టు తెలుస్తోంది. బహుషా ఇవాళ్టి చర్చల్లో కూడా కేంద్రమంత్రులు ఇదే విషయాన్ని తేల్చి చెప్పే అవకాశమే ఉంది. అదే జరిగితే.. సీజేపీ తీసుకునే నిర్ణయం కాస్త కఠినంగానే ఉండవచ్చు.
దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
కేంద్రం నుంచి ఏదో ఒక సమాధానం కోసం వేచి చూస్తోంది సీజేపీ. ఆ వచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే.. వెంటనే దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునివ్వవచ్చు. మరోసారి పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించే అవకాశముంది. వారం రోజుల్లోనే దేశంలో పరిణామాలు వేగంగా మారాయి. నిన్న మొన్నటి దాకా ఢిల్లీకే పరిమితమైన సీజేపీ ఎఫెక్ట్... ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించింది. విపక్షాల నుంచి ఆ పార్టీకి అందుతున్న మద్దతుతో ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ సమయంలో దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తే.. అది ఉధృతంగా మారే అవకాశముంది. జెన్జీ ని అదుపు చేయడం పోలీసుల తరం కూడా కాదు.
ఇప్పటికే ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో స్టేషన్లను మూసివేశారు. జంతర్ మంతర్ చుట్టూ ప్రత్యేక దళాలతో పహారా కాస్తున్నారు. సీజేపీకి కాంగ్రెస్ ఆందోళనలు కూడా తోడు కావడంతో.. ఢిల్లీ అట్టుడుకుతోంది.












