Ramchander Rao: రేవంత్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్.. ధరణి తెచ్చి ప్రజలను వేధిస్తే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పేరుతో ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల జాబితా పేరిట పెద్ద ఎత్తున భూ దోపిడీ జరుగుతోందన్నారు.
30శాతం కమీషన్ డిమాండ్
రైతులు, పేదల భూములను కుట్రపూరితంగానే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. నిషేధిత జాబితా నుంచి భూమిని తీసేయాలంటే 30శాతం కమీషన్ అడుగుతున్నారని చెప్పారు. ఈ మొత్తం వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర భూ భారతి, 22ఏకు నిరసనగా బీజేఎల్పీ ఆధ్వర్వంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
మామూలు తప్పు కాదు..
చిన్న చిన్న కారణాలతో 22ఏ జాబితాలో భూములు చేర్చారని రామచంద్రరావు ధ్వజమెత్తారు. 22ఏ అంశంలో పొరపాటు జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారని.. మరి తప్పు చేసిన వారికి శిక్ష పడాలా? వద్దా? అని రామచంద్రరావు ప్రశ్నించారు. తప్పు జరిగింది, తప్పు జరుగుతోంది, తప్పు జరిపిస్తున్నారు అని సీఎం రేవంత్ పై మండిపడ్డారాయన. అది మామూలుగా జరిగిన తప్పు కాదు, పేదల కడుపు కొట్టినటువంటి పెద్ద తప్పు అని సీరియస్ అయ్యారు.
22ఏ వెనుక పెద్ద దురుద్దేశం
ప్రైవేట్ భూములు, పట్టా భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చారంటే.. ప్రజలకు మీరిచ్చే సంకేతం ఏంటి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీని వెనుక ఏదో పెద్ద దురుద్దేశమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అవినీతిని న్యాయబద్ధం చేసుకునేందుకే రేవంత్ సర్కార్ ఈ 22ఏ జాబితా తీసుకొచ్చిందని రామచంద్రరావు ఆరోపించారు.
వెంటనే జాబితా నుంచి తొలగించాలి
''రాష్ట్రంలోని కోట్లాది ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. నిషేధిత జాబితా నుంచి భూమిని తీసేయాలంటే 30శాతం కమీషన్ అడుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం? రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములను వెంటనే విడుదల చేయాలి. లేదంటే బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. అప్పుడు ధరణి, ఇప్పుడు భూ భారతి.. పేర్లు మారాయి, దోపిడీ మాత్రమే అదే'' అని విరుచుకుపడ్డారు రాంచంద్రరావు.








