BRICS : దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు తొలిరోజే అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదస్సుకు హాజరైన సభ్యదేశాల అధినేతలకు, విదేశీ ప్రతినిధులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారిక విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ గ్రాండ్ డిన్నర్కు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరుకాకపోవడం ఒక్కసారిగా సెన్సేషన్గా మారింది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న కీలక తరుణంలో, జిన్పింగ్ విందుకు దూరంగా ఉండటం రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది.
ద్వైపాక్షిక భేటీ ఓకే.. విందుకు మాత్రం నో
బ్రిక్స్ సదస్సు కోసం శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన జిన్పింగ్.. ఆ వెంటనే ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరిపిన అనంతరం, రాత్రి భారత్ మండపంలో ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన విందులో మాత్రం ఆయన కనిపించలేదు. జిన్పింగ్తో పాటు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ సహా మరికొందరు నేతలు కూడా ఈ విందుకు దూరంగా ఉన్నారు.
దీంతో భారత్-చైనా మధ్య ఏవైనా అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయా అన్న చర్చ మొదలైనప్పటికీ.. జిన్పింగ్ గైర్హాజరు వెనుక అసలు కారణం వేరే ఉందని దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. సుదీర్ఘ విమాన ప్రయాణం, టైమ్ జోన్ మార్పు (జెట్లాగ్) కారణంగా ఆయన తీవ్రమైన అలసటకు గురైనట్లు సమాచారం. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఏమాత్రం విరామం లేకుండా వరుస అధికారిక సమావేశాల్లో పాల్గొనడం, మోడీతో కీలక భేటీ ఉండటంతో షెడ్యూల్ మొత్తం బిజీగా గడిచిందని, తీవ్ర అలసట కారణంగానే విశ్రాంతి తీసుకునేందుకు డిన్నర్కు హాజరుకాలేకపోయారని తెలుస్తోంది.
పుతిన్ స్పెషల్ అట్రాక్షన్..
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ విందు కార్యక్రమానికి దేశంలోని బడా రాజకీయ ప్రముఖులు కూడా భారీగా తరలివచ్చారు. పార్లమెంట్ భవన్ నుంచి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకంగా రెండు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించి భారత్ మండపానికి చేరుకోవడం విశేషం. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్లతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇందులో పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సహా ఇతర ప్రముఖులు కూడా విందులో పాల్గొని సందడి చేశారు.
రెండు రోజుల పాటు అత్యంత కీలక నిర్ణయాలతో సాగిన ఢిల్లీ బ్రిక్స్ సమావేశాలు ఆదివారంతో విజయవంతంగా ముగిశాయి. 11 సభ్యదేశాలు, 10 భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో ప్రధాని మోడీ వరుస ద్వైపాక్షిక చర్చలు కొనసాగించారు. కాగా, తదుపరి 19వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే బాధ్యత చైనాకు దక్కడంతో రానున్న రోజుల్లో బ్రిక్స్ ప్రాధాన్యత మరింత పెరగనుంది.









