BJP : తెలంగాణ శాసనసభ వేదికగా కాషాయ దళం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రభుత్వంపై సమష్టిగా దాడి చేయాల్సిన కీలక సమయంలో, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ లైన్ ప్రకారం నడవాల్సింది పోయి, సొంత ఎజెండాలు, వ్యక్తిగత ఈగోలతో నేతలు ఒకరితో ఒకరు తలపడుతుండటంతో అసలు పార్టీ వైఖరి ఏమిటనేది సామాన్య కార్యకర్తకు సైతం అంతుచిక్కడం లేదు.
టిఫిన్ పాలిటిక్స్.. మంత్రులతో ముచ్చట్లు
అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేశాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు బ్రేక్ఫాస్ట్ టేబుల్పై కూర్చోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్లాలి, లేదంటే ముక్తకంఠంతో అందరూ డుమ్మా కొట్టాలి. కానీ, కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే వెళ్లి మంత్రుల పక్కన కూర్చొని నవ్వులు చిందించడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు సొంత క్యాడర్ నుంచే వెల్లువెత్తుతున్నాయి. మరికొందరైతే ఏకంగా సభలోనే మంత్రుల పనితీరును ఆకాశానికెత్తుతూ ప్రసంగాలు చేస్తుండటం తోటి పార్టీ నేతలకే మింగుడుపడటం లేదు.
ముదిరిన లొల్లి
సమావేశాల తొలి మూడు రోజులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో కాషాదళం సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే నాలుగో రోజు సభలోకి వెళ్లాలా వద్దా అన్న వ్యూహంపై ఎమ్మెల్యేలు భేటీ అయినప్పుడు తీవ్ర స్థాయి వాదోపవాదాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తూ, ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వకుండా తొక్కిపెడుతున్నప్పుడు సభలో ఉండి ఉపయోగం లేదని కొందరు వాదిస్తే, సభకు వెళ్లి తీరాల్సిందేనని మరికొందరు పట్టుబట్టారట.
ఈ పంచాయితీ ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థాయికి చేరినా ఏకాభిప్రాయం కుదరకపోవడం గమనార్హం. అధిష్టానం చెప్పిన వ్యూహాలను కూడా కొందరు సభ్యులు పెడచెవిన పెట్టారనే ప్రచారం పార్టీ క్రమశిక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
ఒకే సబ్జెక్ట్.. భిన్న రాగాలు
మరీ ముఖ్యంగా విధానపరమైన అంశాలపై కొందరు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్న పరస్పర విరుద్ధ అభిప్రాయాలు పార్టీ పరువును బజారున పడేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక ఎమ్మెల్యే గళమెత్తితే, మరొకరు అవి రాష్ట్ర అభివృద్ధికి తప్పనిసరంటూ విరుద్ధమైన ప్రకటన చేశారు. ఇదే సమయంలో పంటల బీమా పథకం అమలు కోరుతూ బీజేపీఎల్పీ డిప్యూటీ లీడర్ పాయల్ శంకర్ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ అసెంబ్లీకి నిరసనగా రాగా, ఆ ఆందోళనలో తోటి ఎమ్మెల్యేలు పెద్దగా భాగస్వామ్యం కాకపోవడం గ్రూపు విభేదాలను తెలిసేలా చేసిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
22A భూముల అంశం వంటి కీలక విషయాల్లో ప్రజాసమస్యలపై నిలదీసి బీజేపీ ఎమ్మెల్యేలు మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, అంతర్గత సమన్వయ లోపం ఆ మైలేజీని తుడిచిపెట్టేస్తోంది. శాసనసభ వేదికపై బలమైన ప్రతిపక్షంగా నిలబడాల్సిన సమయంలో, ఈ 'విభజించి నడుద్దాం' అనే ధోరణి పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని క్షేత్రస్థాయి కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.











