తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మాక్ అసెంబ్లీ' రసవత్తరంగా సాగింది. ఈ సమాంతర సభలో ఇరిగేషన్ (సాగునీటి) శాఖ మంత్రి పాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సాగునీటి విధానాలు, మేడిగడ్డ బ్యారేజీ పట్ల నిర్లక్ష్యం, ఇతర రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖల తీరును ఎండగడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మంత్రి పాత్రలో పల్లా మాట్లాడూతూ.. "నేను సబ్జెక్ట్ ఏమీ ప్రిపేర్ అయి సభకు రాలేదు. ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను, ఆయన చెప్పినట్లే మాట్లాడతాను" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమకు బ్యాంకు చెక్కుల గురించే బాగా తెలుసని, క్యూసెక్కుల గురించి అస్సలు అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును లేదా మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి పేరు వస్తుందని, అందుకే ఆ పనులను తాము ఎప్పటికీ చేయబోమని సభలో చలోక్తులు విసిరారు.
ముఖ్యమంత్రి భాషా సంస్కృతిపై విమర్శలు గుప్పిస్తూ.. తాను ఆర్మీలో పనిచేసిన డిసిప్లిన్ ఉన్న వ్యక్తినని, అయితే ముఖ్యమంత్రి బూతుల ప్రభావం ఇప్పుడు తీవ్రంగా పెరిగిపోయిందని విమర్శించారు. 2004లోనే తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నప్పటికీ, అప్పట్లో మహారాష్ట్రలో తమ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా అనుమతులు ఇవ్వలేదని గుర్తుచేశారు. మరో దశాబ్దం ఆలస్యమైనా సరే తమ్మిడిహట్టినే కడతామని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ (CWC) సమావేశం అంటే మొదట్లో తాము 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ' అనుకున్నామని చురకలంటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన రుణం తీర్చుకోవడానికే ఏపీకి నీటి ప్రయోజనాలు కల్పిస్తున్నామని సెటైర్ వేశారు. కర్ణాటకలో 40శాతం కమిషన్ తీసుకుంటే తెలంగాణలో 30శాతమే తీసుకుంటున్నామని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఫ్యామిలీ లా కూటమిగా మారిన కాంగ్రెస్కు సోనియా గాంధీ ఇచ్చే సర్టిఫికెట్ ఉంటే చాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మాక్ అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ నేతలు చలోక్తులతో ఎండగట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్రెడ్డి, సంజయ్ కుమార్ తదితరులు మాక్ అసెంబ్లీ ముగిసే వరకు కడుపుబ్బా నవ్వుతూ కనిపించారు.







