పనీర్ చాలామందికి ఇష్టమైన ఫుడ్. వెజ్ బిర్యానీ నుంచి బటర్ పనీర్ వరకు.. హోటల్ మెనూలో పనీర్ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ ఇప్పుడు అదే పనీర్ పేరుతో జరుగుతున్న దందా ఆందోళన కలిగిస్తోంది. కొందరు వ్యాపారులు కల్తీ పనీర్ ను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలాగాటమాడుతున్నారు.. ఇలాంటి ఘటనలు రెండు రాష్ట్రాలలో తరచుగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే..
తాజాగా అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో కల్తీ పనీర్ కలకలం సృష్టించింది. అమలాపురం పరిధిలో అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఉన్న పనీర్ను గుర్తించి నమూనాలు సేకరించి వాటిని పరీక్షలకు పంపించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే ఆ పనీర్లో అసలు ఏం కలిపారన్నది స్పష్టమవుతుంది. ఇక రావులపాలెంలో స్థానిక హోటల్లో పనీర్ వంటకాలు తిన్న ఓ కుటుంబం తీవ్ర అనారోగ్యానికి గురైందనే ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. దీంతో హోటళ్లలో వినియోగిస్తున్న పనీర్ నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక స్వచ్ఛమైన పాలతో పనీర్ తయారు చేస్తే ఖర్చు ఎక్కువ. ఒక లీటర్ పాల నుంచి సుమారు 150 గ్రాముల వరకు మాత్రమే పనీర్ లభిస్తుంది.
కానీ నకిలీ లేదా అనలాగ్ పనీర్ తయారీలో పాలకు బదులుగా పాలపొడి, నూనెలు, స్టార్చ్, వనస్పతి, పామాయిల్ వంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో పెద్ద మొత్తంలో పనీర్ తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కిలో పనీర్ రూ.50 లోపే తయారవుతుందనే ప్రచారం కూడా ఉంది. ఇదే హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారులను ఆకర్షిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వందల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉన్నాయి. రోజూ భారీ స్థాయిలో పనీర్ వినియోగం జరుగుతోంది. కానీ ఇందులో అసలు పన్నీర్ కంటే కల్తీ పన్నీర్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి..
అందుకే ఇలాంటి కల్తీ ఆహారం విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పలు సందర్భాలలో ఆరోగ్యనిపుణులు సూచించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు మరింత పెంచాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.








