రాష్ట్రంలో మరో విషాదం నెలకొంది. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదాతలు ఆయుష్షు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని, పంట అమ్ముకోగా వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాలని భావించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. మరో వైపు అన్నదాత మరణిస్తే బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన రైతు బీమా కూడా రావడం లేదని తెలియడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో సాగు నీరు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు నిండితే పొలాలకు నీరు వస్తుందని, గత రెండేండ్లుగా కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయకపోవడంతో ఎగువ ప్రాంతాల రైతులకు సాగు నీరు అందడం లేదు. ఫలితంగా పంటలు పండక పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీనికి తోడు గతేదాది నుంచి యూరియా దొరక్క కూడా పంటలు సాగు అవ్వడం లేదని సమాచారం.
యూరియా కేంద్రాల చుట్టూ తిరిగిన దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. యూరియా యాప్స్లో దొరకడం లేదని, కేంద్రాలకు వెళితే యాప్లో బుక్ చేసుకోవాలని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఫలితంగా సకాలంలో యూరియా, సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చేతికచ్చిన పంట పురుగుల పాలు అవుతోందని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
https://x.com/pulsenewsbreak/status/2096450276081471675?s=20
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మెదక్ జిల్లా శౌకత్పల్లిలో రవీందర్రెడ్డి (40) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం, కుటుంబ అవసరాల కోసం రూ.4.50 లక్షల అప్పులు చేయగా.. అవి తీర్చే మార్గం లేక పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటిలో అశోక్ (56) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతేడాది వర్షాలు, వరదలతో పంట నష్టం వాటిల్లిందని, పెట్టుబడి కూడా చేతికి రాక ఆర్థిక ఇబ్బందుల పాలై ప్రాణాలు తీసుకున్నట్టు తెలిసింది.ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు.








