Mumbai Mahaganpati: దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ మొదలవుతున్న వేళ.. వాణిజ్య రాజధాని ముంబైలోని ప్రముఖ గణేష్ పండల్ మరోసారి సరికొత్త సంచలనానికి వేదికైంది. దేశంలోనే అత్యంత సంపన్నమైన గణపతిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్లోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్ సేవా మండల్ మహాగణపతి శనివారం తొలిసారిగా భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా చేరుకున్న భక్తులు స్వామివారి దివ్య వైభవాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. అయితే ఈసారి నిర్వాహకులు స్వామివారికి చేసిన భద్రతా ఏర్పాట్లు, అలంకరించిన ఆభరణాల విలువ తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఏకంగా రూ.703 కోట్ల రికార్డు బీమా
సాధారణంగా ప్రముఖ దేవాలయాలకే కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉండటం చూస్తుంటాం. కానీ ఈ జీఎస్బీ సేవా మండల్ వినాయక మండపానికి ఏకంగా రూ.703.27 కోట్ల రికార్డు స్థాయి ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించారు. భారతదేశ గణేష్ ఉత్సవాల చరిత్రలోనే ఇంతటి భారీ మొత్తంలో బీమా పాలసీ తీసుకోవడం అరుదైన రికార్డుగా నిలుస్తోంది. స్వామివారి విగ్రహం, అలంకరించిన ఆభరణాలతో పాటు మండపానికి విచ్చేసే వేలాది మంది భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ కవరేజీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
66 కిలోల బంగారం.. 335 కిలోల వెండి
కింగ్స్ సర్కిల్ మహాగణపతిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు అనేంత అద్భుతంగా నిర్వాహకులు గణపయ్యను అలంకరించారు. స్వచ్ఛమైన బంగారు, వెండి వస్తువులతో పాటు అత్యంత విలువైన రత్నాలు, వజ్రాభరణాలతో విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గణపయ్య అలంకరణలో ఏకంగా 66 కిలోలకు పైగా స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఆభరణాలు, దాదాపు 335 కిలోల వెండి కిరీటాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విలువైన రత్నాలను వాడారు. ధగధగ మెరిసిపోతున్న గణనాథుడిని దర్శించుకునేందుకు మొదటి రోజే భక్తజనం పోటెత్తారు.
వైభవానికి మించిన సేవా దృక్పథం..
కేవలం బంగారం, వెండి ఆడంబరాలకే పరిమితం కాకుండా.. వేద సంప్రదాయాలు, భక్తి, సేవా కార్యక్రమాలకు జీఎస్బీ సేవా మండల్ సమాన ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం నిత్యాన్నదానం. పండల్ ముగిసే వరకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు, నిరుపేదలకు నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో ప్రసాద వితరణ చేపడుతున్నారు. అటు రూ.700 కోట్ల పైచిలుకు విలువైన రక్షణ వలయం, ఇటు పేదలకు నిరంతర ఆకలి తీర్చే అన్నదానంతో ముంబై మహాగణపతి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.








