Jagadish Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఉద్దేశించి బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆ ఇద్దరిని బీఆర్ఎస్ లోని రానివ్వం అని తేల్చి చెప్పారాయన. మీడియాతో చిట్ చాట్ లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ లోకి రానివ్వమని చెప్పారు. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని తేల్చి చెప్పారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ లోకి తీసుకోబోమన్నారు. తనను బీఆర్ఎస్ లోకి తీసుకోవాలని రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకునేది లేదన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ వస్తామన్నా తీసుకోలేదు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వస్తామంటున్నారన్న జగదీశ్ రెడ్డి.. అందులో ఒకరిద్దరిని తప్ప మిగతా వారెవరినీ పార్టీలోకి రానివ్వమని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో ఇద్దరు బీఆర్ఎస్ లోకి రావడం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలకంటే ముందే కోమటిరెడ్డి బ్రదర్స్ బీఆర్ఎస్ లోకి వస్తామంటే తీసుకోలేదని చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత
వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంటు నియోజకవర్గాల పునర్ విభజన జరక్కపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరుగుతుందన్నారు. ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. డీలిమిటేషన్ జరిగితే ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడొచ్చని చంద్రబాబు భావిస్తున్నారని జగదీశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్ లోకి రానివ్వం అంటూ జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు బీఆర్ఎస్ లో అటు కాంగ్రెస్ లో డిస్కషన్ జరుగుతోంది. కాగా, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం అంటూ జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది.







