రాష్ట్రంలో ఇటీవల వరుసగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి ఆదేశాలు అందడంతో మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్లో నమోదైన ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు మంగళవారం ఉదయం హైదరాబాద్, బెంగళూరులో ఆకస్మిక దాడులు చేస్తున్నాయి.
మొత్తం 15 బృందాలు ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో 7 చోట్ల, బెంగళూరులో రెండు చోట్ల ఈ తనిఖీలు చెపట్టాయి. రూ. కోట్లు విలువైన డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి నగరంలో ఇటీవల ఓ కేసు నమోదైంది.దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా ఆధారాల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
డ్రగ్స్ కేసులోని నిందితులకు హైదరాబాద్తో పాటు బెంగళూరులోనూ కనెక్షన్లు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇక్కడ, అక్కడ సోదాలు జరుపుతున్నట్టు తెలిసింది. మత్తు పదార్థాల సప్లయ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగానే బెంగళూరులోనూ ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
మాదకద్రవ్యాల వినియోగంలో డ్రగ్స్ పెడ్లర్లు నెట్వర్క్తో పాటు మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారిలో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఈడీకి సమాచారం అందినట్టు తెలిసింది. అందుకే గుట్టుగా సమాచార సేకరణలకు సోదాలు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.












